కమల్నాథ్ నాన్ లోకల్: కాంగ్రెస్ పార్టీపై ఎంపీ సీఎం శివరాజ్ చౌహాన్ విమర్శలు
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్పై బీజేపీ నేత, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కమల్నాథ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన్ను నమ్మలేమంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం భోపాల్ జిల్లాలోని బెరాసియా నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో శివరాజ్ చౌహాన్ మాట్లాడారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుందోనని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇస్తోన్న తప్పుడు వాగ్ధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివరాజ్ కోరారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రజలు నష్టపోతారని హెచ్చరించారు.

కమల్నాథ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు.. ఆయన ఇక్కడ పుట్టలేదని శివరాజ్ చెప్పారు. అయితే, కమల్నాథ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో జన్మించారు. మనమంతా ఇక్కడే పుట్టామని, ఆయన బయటి వ్యక్తి గనక ఇక్కడే ఉండరని శివరాజ్ వ్యాఖ్యానించారు. కమల్నాథ్ ను ఎలా నమ్మగలమని సీఎం శివరాజ్ ప్రజలను ప్రశ్నించారు.
కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండేదన్నారు. కానీ, తనకు ఆ సమస్య లేదని.. పనులన్నీ పూర్తి చేసేందుకు సరిపడా నిధులు ఉన్నాయని శివరాజ్ చెప్పారు. మొదలు పెట్టిన అన్ని పనులూ పూర్తి చేస్తామని శివరాజ్ హామీ ఇచ్చారు. కాగా, ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఓ వైపు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తూనే ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తున్నారు. కాగా, 230 స్థానలు కలిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications