మరో వివాదంలో కంగనా రనౌత్-అయితే గాంధీ ఫ్యాన్ -లేకపోతే నేతాజీ సపోర్టర్-రెండూ కుదరవు
దేశంలో తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అవుతున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ . తాజాగా భారత స్వాతంత్రంపై చేసిన వ్యాఖ్యలు చిచ్చురేపుతూనే ఉన్నాయి. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది 1947లో కాదని, 2014లో మోడీ సర్కార్ రాకతో అని, 1947లో వచ్చింది బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష అంటూ కంగన చేసిన వ్యాఖ్యలపై ప్రత్యర్ధులు ఇంకా విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆమె పద్మశ్రీ అవార్డు కూడా అందుకోవడంతో ఇది తిరిగిచ్చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
ఇప్పుడు కంగన మరో వివాదంలో చిక్కుకున్నారు. మరోసారి తన నోటికి పని చెప్పిన కంగన గాంధీ, నేతాజీలను పోలుస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉంటే మహాత్మాగాంధీ అభిమానిగా ఉండాలని, లేదా నేతాజీ మద్దతుదారులుగా ఉండాలన్నారు. ఇద్దరిలా ఉంటానంటే సాధ్యం కాదన్నారు. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కంగన సూచించారు. దీంతో ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ అహింసను ఆయుధంగా చేసుకుని పోరాడగా.. నేతాజీ హింసతోనే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మారు. వీరిద్దరి విధానాలు వేరు. అయినా వీరిద్దరూ స్వాతంత్ర సమరయోధులుగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు కంగన వీరిలో ఏవరో ఒకరిలాగే ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు వారిని అవమానించేలా ఉన్నాయన్న చర్చ సాగుతోంది.
నేతాజీని బ్రిటిషర్లకు అప్పగించడానికి గాంధీజీ అంగీకరించారన్న వార్తను ప్రచురించిన ఓ వార్తాపత్రిక క్లిప్లింగ్ ను తన ఇన్ స్టా గ్రామ్ పోస్టుకు జత చేస్తూ కంగనా రనౌత్... తన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు కంగన వ్యాఖ్యలపై మరో వివాదం రేగుతోంది. మరో ఇన్ స్టా గ్రామ్ పోస్టులో కంగన ఎవరైతే స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు బ్రిటీషర్లకు అప్పగించబడ్డారని, కానీ ఎవరికైతే ధైర్యం లేదో, ప్రత్యర్ధులతో తలపడే వేడి రక్తం లేదో వారే జిత్తులమారులని, అధికారం కావాలని కోరుకున్నారని కంగన మరో తీవ్ర వ్యాఖ్య కూడా చేశారు. ఈ వ్యాఖ్యలు గాందీ, నెహ్రూల్ని ఉద్దే్శించి ఆమె చేసినవే అనే వాదన వినిపిస్తోంది. దీంతో కంగనకు అడ్డుకట్టే వేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.