కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు....
కేంద్రమంత్రి,రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ రాందాస్ అథవాలే గురువారం సినీ నటి కంగనా రనౌత్ను ముంబైలోని ఆమె నివాసంలో కలిశారు. ఇటీవలి పరిణామాలపై అథవాలే ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
రాజకీయాల పట్ల ఆసక్తి లేదని కంగనా రనౌత్ తనతో చెప్పినట్లు అథవాలే తెలిపారు. అయితే సమాజంలో ఐక్యతను ఏర్పరిచే విషయంలో తనకు ఆసక్తి ఉన్నట్లు కంగనా చెప్పారన్నారు. తన రాబోయే సినిమాలో ఒక దళిత మహిళ పాత్ర పోషిస్తున్నానని చెప్పిన కంగనా... కుల వ్యవస్థ అంతం కావాలని అభిప్రాయపడినట్లు చెప్పారు.
మొత్తం మీద సినిమాల్లో కొనసాగినంత కాలం తాను రాజకీయాల్లోకి రావాలనుకోవట్లేదని కంగనా చెప్పినట్లు అథవాలే తెలిపారు. ఆమెకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేనప్పటికీ... ఒకవేళ ఆమె బీజేపీ లేదా ఆర్పీఐ పార్టీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ వ్యవహారంలో కంగనా తొలి నుంచి మహా సర్కార్ను ఢీకొడుతుండటం... ఆమె వెనకాల బీజేపీ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో... కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కూడా అందుకు కలిసొస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని తేల్చేశారు కంగనా.
కాగా,ముంబైలోని కంగనా కార్యాలయం కూల్చివేతపై ముంబై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబర్ 22 వరకు వాయిదా వేసింది.