తెలుగు రాష్ట్రాల మీదుగా కాన్పూర్-మధురై రైళ్లు..! షెడ్యూల్, హాల్ట్ లివే..!
పండుగల సీజన్ ప్రారంభం కాబోతున్న వేళ దేశవ్యాప్తంగా రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దని తట్టుకునేందుకు ప్రతీ రైల్వే జోన్ కూడా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల మీదుగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను వరుసగా ప్రకటిస్తున్నారు. ఇందులో యూపీలోని కాన్పూర్ నుంచి తమిళనాడులోని మధురై మధ్య ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించారు.
పండుగల నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకూ కాన్పూర్-మధురై మధ్య ప్రత్యేక రైళ్లను (Kanpur-Madurai Special Trains) నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా కాన్పూర్ సెంట్రల్ నుంచి మధురైకు సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 25 వరకూ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అలాగే మధురై నుంచి కాన్పూర్ సెంట్రల్ కు సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28 వరకూ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రెండు వైపులా రైళ్లూ తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ముందుగా కాన్పూర్ సెంట్రల్ నుంచి మధురైకు ప్రత్యేక రైలు నంబర్ 01925 ప్రతీ బుధవారం ఉదయం 8.10కు బయలుదేరి శుక్రవారం ఉదయం 7.15కు గమ్యానికి చేరుకుంటుంది. అలాగే మధురై నుంచి కాన్పూర్ సెంట్రల్ స్టేషన్ కు మరో ప్రత్యేక రైలు ప్రతీ శనివారం తెల్లవారు జాము 2.30కు బయలుదేరి సోమవారం తెల్లవారు జాము 4.30కు గమ్యానికి చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకూ తెలుగు రాష్ట్రాల్లో బల్లార్షా, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో స్టాప్ లు ఇచ్చారు. అలాగే ఈ రెండు రైళ్లలోనూ సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, ధర్డ్ ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.















Click it and Unblock the Notifications