కర్ణాటకకు ప్రత్యేక ‘జెండా’: సిద్ధరామయ్య సంచలన నిర్ణయం, ‘వేర్నాటువాదమా?’
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేసేందుకు ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఏర్పాటు చేసేందుకు ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. సిద్ధరామయ్య ఆదేశాలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వేర్పాటువాదానికి, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు ఊతమిచ్చేలా ఉందంటూ సిద్ధరామయ్యపై విపక్ష నేతలు మండిపడ్డారు. అయినా, సిద్ధరామయ్య తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండకూడదనే నిషేధం రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండటంపై భారతీయ జనతా పార్టీకి ఏదైనా అభ్యంతరాలుంటే బహిరంగంగా చెప్పవచ్చని ఆయన అన్నారు. కాగా, ఎన్నికల లబ్ధి కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్న విమర్శలను కూడా ఆయన తోసిపుచ్చారు.
అంతేగాక, ఎన్నికలతో సంబంధమే లేదని, ఎన్నికలకు చాలా టైముందని అన్నారు. అయితే, సిద్ధరామయ్య ప్రత్యేక జెండా ఆదేశాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా స్పందించలేదు.
ఒకవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశమంతా ఒకటే, నేషన్ ఫస్ట్ అంటూ నినాదాలు చేస్తున్న సమయంలో సిద్ధరామయ్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇటీవలే వన్ నేషన్-వన్ టాక్స్ అంటూ జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.