ఏపీలో వినాయక చవితిపై రాజకీయ రచ్చ: అక్కడ 3 రోజులకు కుదించిన బీజేపీ సర్కార్: ప్రసాదాలకు నో
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఈ ఏడాది కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఇప్పటికే కేరళలో వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతోన్నాయి. తమిళనాడు, మహారాష్ట్రల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ థర్డ్వేవ్ ముంచుకుని రానుందనే సంకేతాలను పంపిస్తోన్నాయి. అక్కడ రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా కేసుల తీవ్రత పెరుగుతోంది. దేశంలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 38,948 కేసులు నమోదు కాగా.. అందులో 80 శాతం వాటా కేరళ, మహారాష్ట్రలదే.
Bigg Boss Telugu 5: నాగార్జున హోస్టింగ్ బోర్ కొట్టిందా?: జూనియర్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్
కరోనా నేపథ్యంలో కఠిన నిర్ణయాలు..
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభించిన సమయంలో దాని బారిన పడి తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా అదే స్థాయిలో రికార్డయ్యాయి. ఈ పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకుండా ఉండటానికి కర్ణాటక ప్రభుత్వం.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది. మూడు నెలల పాటు ఎలాంటి పండగలను కూడా నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తుషార్ గిరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వినాయక చవితి మూడురోజులు..
సాధారణంగా వినాయక చవితి పండుగను తొమ్మిదిరోజుల పాటు జరుపుకొంటుంటారు. కర్ణాటక కూడా దీనికి మినహాయింపేమీ కాదు. పైగా కర్ణాటకలో గణేష్ చతుర్థిని రెండురోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గౌరీ గణేష్ పండుగగా పిలుస్తారు. మొదటి రోజు గౌరీదేవిని పూజిస్తారు. ఆ మరుసటి రోజు గణేష్ చతుర్థిని జరుపుకుంటూంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కర్ణాటక ప్రభుత్వం మూడు రోజులకు మాత్రమే పరిమితం చేసింది. తొమ్మిదిరోజుల ఉత్సవాలను మూడు రోజులకు కుదించింది. కరోనా వైరస్ పాజిటివిటీ రేటు రెండు శాతం తక్కువ ఉన్న జిల్లాల్లో మాత్రమే అయిదు రోజులకు అనుమతి ఇచ్చింది.
రాత్రి 9 గంటల వరకే..
బెంగళూరు మహానగర పాలికె పరిధిలో గణేష్ మండపాలను ఏర్పాటు చేయదలిచిన యూత్ అసోసియేషన్లు గానీ, ఇతర నిర్వాహకులు గానీ రాత్రి 9 గంటల వరకే ఉత్సవాలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు తాజా మార్గదర్శకాలను జారీ చేశారు. నిర్వాహకులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్లను వేయించుకుని ఉండాలని సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోని వారికి మండపాలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్లను బీబీఎంపీ అధికారులకు చూపించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
మండపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు బంద్..
వినాయకుడి మండపాల్లో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు గానీ, వేడుకలు, ఉత్సవాలను గానీ నిర్వహించకూడదని అధికారులు ఆదేశించారు. ప్రత్యేక పూజలకూ అనుమతి లేదని స్పష్టం చేశారు. దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తేల్చి చెప్పారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సమయంలో నిర్వహించే ప్రదర్శనల్లో 20 మందికి మించకూడదని సూచించారు. బీబీఎంపీ అధికారులు నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి ఉంటుందని అన్నారు.
ప్రసాదాల పంపిణీకి నో..
వినాయక విగ్రహాలతో కూడిన మండపాలను ఏర్పాటు చేసిన సమయంలో వాటిని సందర్శించడానికి వచ్చే భక్తులకు నిర్వాహకులు తీర్థ, ప్రసాదాలను ఇవ్వడంపైనా నిషేధాన్ని విధించిన కర్ణాటక ప్రభుత్వం. నిర్వాహకుల్లో ఎవరైనా పొరపాటున కరోనా వైరస్ బారిన పడితే.. తీర్థ ప్రసాదాల వితరణ ద్వారా భక్తులకు సోకే ప్రమాదం ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సెక్షన్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని ఆదేశించారు.
ఏపీలో రాజకీయ రచ్చ..
వినాయక చవితి పండుగ నిర్వహణపై ఏపీలో రాజకీయ రచ్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో వేడుకలను నిర్వహించడాన్ని జగన్ సర్కార్ నిషేధించింది. దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార దర్పం, మందీ మార్బలంతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని హెచ్చరిస్తోన్నారు బీజేపీ నేతలు. గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని శాంతియుతంగా చేస్తున్న నిరసన దీక్షలను అడ్డుకోవడం, నేతలను అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఇలా..
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ వినాయక చవితి పండుగ నిర్వహణకు అనేక రకాల ఆంక్షలతో కూడిన అనుమతులను ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం. తీర్థ ప్రసాదాల వితరణకూ అవకాశం ఇవ్వలేదు. అదే బీజేపీ పార్టీ.. ఏపీలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ నిరసన ప్రదర్శనలను చేయడాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు.
Recommended Video
స్వయంగా మోడీ చెప్పారంటూ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా పండుగల నిర్వహణను నిషేధించిందని గుర్తు చేస్తోన్నారు. ఈ పండుగల సీజన్ వచ్చినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా మతాన్ని తెర మీదికి తీసుకొచ్చారని ఎదురుదాడికి దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కూడా తప్పు పడుతూ బీజేపీ నేతలు, తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోన్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.