Prakash Raj: వెన్నుపోటుదారులను గెలిపించారు..కంగ్రాచ్యులేషన్స్ కర్ణాటక: ప్రకాశ్ రాజ్ సెటైర్లు
బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగేలా హై ఓల్టేజీ షాక్ ఇచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించగా.. రెండు చోట్ల మాత్రమే హస్తం పార్టీ విజయం సాధించగలిగింది. మరో 12 చోట్ల అధికార భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ మిత్రపక్షంగా బరిలో దిగిన జనతాదళ్ (సెక్యులర్) ఖాతాను కూడా తెరవలేకపోయింది.
ప్రకాశ్ రాజ్ లో అసహనం..
ఇదివరకు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ తరఫున విజయం సాధించారు. ఈ వ్యవహారం కాస్తా.. ప్రముఖ నటుడు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్ కు అసహనానికి గురి చేసినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు ముగిసిన కొద్ది సేపటికి ప్రకాశ్ రాజ్.. తన ట్విట్టర్ కు పని చెప్పారు. తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
కంగ్రాచ్యులేషన్స్ కర్ణాటక అంటూ..
ఉప ఎన్నికల ఫలితాలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ కర్ణాటక అని ఎద్దేవా చేసినట్లు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు ఎమ్మెల్యేలను గెలిపించడాన్ని ఆయన పరోక్షంగా తప్పుపట్టినట్టు కనిపించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెన్నుపోటుదారులుగా అభివర్ణించారు. ఉప ఎన్నికల్లో కర్ణాటకల ఓటర్లు వెన్నుపోటుదారులను గెలిపించారని, వారికి కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నానని అన్నారు.

పాము చావకుండా.. కర్ర విరగకుండా..
పాము చావకూడదు.. కర్ర విరగకూడదు అనే తీరులో కర్ణాటక ఓటర్లు ఉప ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు. ఆత్మాభిమానం అధికంగా ఉన్న కన్నడిగులు తెలివిగా తీర్పు ఇచ్చారని చెప్పారు. కన్నడ ఓటర్ల ఆశీర్వాదంతో ఒకప్పటి అసంతృప్త కాంగ్రెస్-జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. బీజేపీ అభ్యర్థులుగా గెలిచి, సంతృప్తి చెంది ఉంటారని తన ట్విట్టర్ లో రాసుకొచ్చారాయన. జన్మజన్మలకూ కన్నడిగులు ఇలాంటి తీర్పే ఇస్తారని, దీనిక తాను గ్యారంటీ అని చెప్పారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా..
బహుభాషా నటుడిగా తిరుగులేని పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ ఈ ఏడాదే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ కూడా చేశారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీ అంటే ఆయనకు ఏ మాత్రం పడదు. అలాగని- కాంగ్రెస్ తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు లేవు.












Click it and Unblock the Notifications