రైతులు రుణమాఫి: సీఎం కుమారస్వామి స్కెచ్: ఎంపీలు, ఎమ్మెల్యేల రుణాలు, 15 రోజులు !
బెంగళూరు: రైతుల రుణమాఫీ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి రెండు సూత్రాలు పాటించాలని నిర్ణయించారు. బుధవారం విధాన సౌధలో సీఎం కుమారస్వామి జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ, రైతు సంఘం నాయకులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత రెండు సూత్రాల నిర్ణయం పాటించాలని భావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవసాయం కోసం రుణం తీసుకున్నారని, వారి రుణాలు ప్రభుత్వం తీర్చాలా అనే విషయంలో చర్చించాలని కుమారస్వామి నిర్ణయించారు.

రైతుల సలహాలు
విధాన సౌధలో రైతు సంఘాల నుంచి సలహాలు స్వీకరించిన కుమారస్వామి రుణమాఫీ విషయంలో వారితో చర్చించారు. రైతు సంఘం నాయకులు కోడిహళ్ళి చంద్రశేఖర్, కరబూరు శాంతకుమార్ తదితరుల నుంచి సీఎం కుమారస్వామి వివరాలు సేకరించారు.

15 రోజులు సమయం
రైతుల రుణమాఫీలు వెంటనే మాఫీ చెయ్యాలంటే ఎలా సాధ్యం అవుతుందని కుమారస్వామి ప్రశ్నించారు. తనకు 15 రోజులు సమయం ఇస్తే మంత్రి వర్గం, రాహుల్ గాంధీ, మాజీ సీఎం సిద్దరామయ్యతో చర్చించి రైతుల రుణమాఫీపై అంతిమ నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి అన్నారు. తరువాత రైతుల రుణమాఫీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలుసుకుని అంతిమ నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి చెప్పారు.

మొదటి సూత్రం
* పంటసాగు కోసం పేద, మద్యతరగతి రైతులు తీసుకున్న రుణం పూర్తిగా మాఫీ చేస్తారు. 1/4/2009 నుంచి 31/12/2017 వరకు తీసుకున్న రైతు రుణాల మాఫీ చేస్తారు.
* సంవత్సరానికి రూ. 4 లక్షల ఆదాయానికి పన్ను చెల్లిస్తున్న రైతులను ఈ పరిధిలోకి తీసుకోవాలా ? రుణం తీసుకుని వ్యవసాయం చెయ్యకుండా వ్యాపారం చేస్తున్న వారిని రుణమాఫీల పరిధిలోకి తీసుకోవాలా అని చర్చించనున్నారు.
* ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవసాయం కోసం రుణాలు తీసుకున్నారు. ఈ నాయకుల రుణామాఫీ చెయ్యాలా? అని చర్చించనున్నారు.
* సహకార సంఘ సభ్యులు, రూ. 3 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారిని రుణమాఫీల పరిధిలోకి తీసుకురావాలా ? అని చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

సీఎం రెండవ సూత్రం
* వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చెయ్యడానికి, బోరుబావులు వెయ్యడానికి, ఎడ్ల బండ్లు కొనుగోలు చెయ్యడానికి రైతులు తీసుకున్న రుణం మొత్తం రద్దు చేస్తారు.
* ప్రతిజిల్లాలో జిల్లాధికారిని నోడల్ అధికారిగా నియమిస్తారు. రుణం ఎందుకు తీసుకున్నారు, ఎంత రుణం తీసుకున్నారు, ఎంత ఖర్చు అయ్యింది అనే పూర్తి వివరాలను రైతులు జిల్లా నోడల్ అధికారికి పూర్తి సమాచారం ఇవ్వాలి. ఇలా రెండు సూత్రాలతో రైతుల రుణమాఫీ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటకలోని కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications