రైతుల రుణమాఫీ సాధ్యం కాదని చెప్పలేదు, యూటర్న్ లేదు: బీజేపీ స్ట్రైట్ వే: కుమారస్వామి ఫైర్ !
Recommended Video
బెంగళూరు: కర్ణాటక రైతుల రుణమాఫీలు చెయ్యడం సాధ్యం కాదని తాను ఎక్కడా చెప్పలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. వారంలోపు రైతుల రుణమాఫీ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నామని కుమారస్వామి మంగళవారం మీడియాకు చెప్పారు. తాను యూటర్న్ తీసుకోలేదని, బీజేపీ ఏమైనా స్రైట్ వేలో వెలుతుందా అని కుమారస్వామి ప్రశ్నించారు.
రూ. 58,000 కోట్లు రుణం
కర్ణాటక రైతులు జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో దాదాపు రూ. 58,000 కోట్ల వరకు రుణం తీసుకున్నారు. రైతుల రుణమాఫీ చేస్తామని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు శాసన సభ ఎన్నికల ప్రచారంలో రైతులకు హామీ ఇచ్చాయి.
బీజేపీ తొలి సంతకం
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ ఫైల్ మీద సంతకం చేస్తామని శాసన సభ ఎన్నికలకు ముందు బీఎస్. యడ్యూరప్ప హామీ ఇచ్చారు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల తరువాత మే 17వ తేదీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప తన తొలి సంతకం రైతుల రుణమాఫీ ఫైల్ మీద పెడుతానని మీడియాకు చెప్పారు. అయితే మే 19వ తేదీ అసెంబ్లీలో బలపరీక్ష జరగకముందే యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.
బ్లూ ప్రింట్
రైతుల రుణమాఫీ చేసే విషయంలో అధికారులతో చర్చించామని, రైతుల రుణాలు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారు అనే పూర్తి సమాచారంతో అధికారులు బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారని, త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం కుమారస్వామి మీడియాకు చెప్పారు.
యూటర్న్ తీసుకోలేదు
రైతుల రుణమాఫీ విషయంలో తాను యూటర్న్ తీసుకున్నానని యడ్యూరప్ప ప్రచారం చెయ్యడంలో వాస్తవం లేదని సీఎం కుమారస్వామి అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో తాను ఎలాంటి పరిస్థితిలో యూటర్న్ తీసుకోనని కుమారస్వామి మీడియాకు చెప్పారు.
బీజేపీ స్రైట్ వే
రైతుల రుణమాఫీ విషయంలో తాను యూటర్న్ తీసుకుంటున్నానని ప్రచారం చేస్తున్న బీజేపీ ఏమైనా స్రైట్ వేలో వెలుతుందా ? అని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రశ్నించారు. సంకీర్ణ ప్రభుత్వంలో అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని, ఒక్కరే ఎలాంటి నిర్ణయం తీసుకోలేరని బీజేపీకి తెలీదా అని సీఎం కుమారస్వామి యడ్యూరప్పను ప్రశ్నించారు.