నాడు వైఎస్సార్- నేడు సిద్ధరామయ్య: జనంతో నేరుగా
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ప్రజలను నేరుగా కలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే సిద్ధరామయ్య- రాష్ట్ర పరిపాలనపై తనదైన ముద్రను వేసే ప్రయత్నం చేస్తోన్నారు. ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలను నేరుగా వారి నుంచే తెలుసుకుంటోన్నారు. వారితో ముఖాముఖి కలుసుకుంటోన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలాంటి ప్రయత్నాలే చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన విజయం సాధించారు కూడా. ప్రజా దర్బార్ పేరుతో ప్రతిరోజూ హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో ప్రజలను కలుసుకునే వారాయన. ముఖ్యమంత్రే తమ సమస్యలను తెలుసుకుంటోండటం, వాటిని తక్షణమే పరిష్కరిస్తోండటం వల్ల ఈ ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున ఆదరణ లభించేది.

రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు దరఖాస్తులను చేతబట్టుకుని ప్రజా దర్బార్కు హాజరయ్యే వారు అప్పట్లో. దరఖాస్తులను నేరుగా ముఖ్యమంత్రికి అందజేసేవారు. వాటికి పరిష్కారం లభించేది కూడా. ఫలానా సమస్యను పరిష్కరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దరఖాస్తుదారులకు సమాచారం కూడా వెళ్లేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకంతో కూడిన లేఖను వారికి అందేది.
ఇప్పుడు అదే తరహా ప్రజా దర్బార్ను ప్రారంభించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. దీనికి పెట్టిన పేరు- జనత దర్శన్. ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల వ్యవధిలోనే ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరు కుమారకృప రోడ్లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ప్రతిరోజూ ఉదయం ఈ జనత దర్శన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కింద ఆయన ప్రజలను నేరుగా కలుసుకుంటారు. వారి నుంచి వినతులను స్వీకరిస్తారు.

34 మందితో మంత్రివర్గాన్ని ఇటీవలే విస్తరించారు సిద్ధరామయ్య. వారికి శఆఖలను కూడా కేటాయించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వద్దే ఉంచుకున్నారు. ఈ శాఖను వేరే వారెవరికీ కేటాయించలేదు. పాలన సంస్కరణలు, సమాచారం, ఇంటెలిజెన్స్ విభాగాలు, ఎవరికీ కేటాయించని శాఖలు.. ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల శాఖను కేటాయించారు.












Click it and Unblock the Notifications