కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్..
వైద్య నిర్లక్ష్యం కారణంగా మహిళ మృతి చెందిన ఘటనలో కర్ణాటకలో సంచలన తీర్పు వెల్లడైంది. వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం గుర్తుండిపోయే తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా మొత్తం ₹16.35 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ, వైద్య సేవల్లో బాధ్యత ఎంత కీలకమో మరోసారి స్పష్టం చేసింది.
ఘటన ఎలా జరిగింది?
హోళేనరసిపుర్కు చెందిన 41 ఏళ్ల శోభ వీపు నొప్పితో బాధపడుతూ 2024 జూలై 10న హాసన్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అదే రోజు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆపరేషన్ సమయంలో కీలక రక్తనాళం దెబ్బతినడంతో తీవ్రమైన రక్తస్రావం జరిగింది. శస్త్రచికిత్స తర్వాత వెంటనే తగిన వైద్యం అందించాల్సిన సమయంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

బెంగళూరుకు తరలింపు..
శోభ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమెను చివరకు బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి అదుపులో లేకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.
ఈ నేపథ్యంలో, మృతురాలి భర్త రామచంద్ర 2024 ఆగస్టు 30న జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయిస్తూ ₹50 లక్షల నష్టపరిహారం కోరుతూ ఫిర్యాదు దాఖలు చేశారు. కేసును విచారించిన బెంచ్-ఛైర్పర్సన్ సి.ఎం. చంచల, సభ్యురాలు ఆర్. అనుపమ-వైద్య నివేదికలు, సాక్ష్యాలు, ఆసుపత్రి రికార్డులను సమగ్రంగా పరిశీలించింది.
విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శస్త్రచికిత్సను హడావిడిగా నిర్వహించడమే కాకుండా, అవసరమైన ప్రాథమిక వైద్య ప్రమాణాలు పూర్తిగా పాటించలేదని ఫోరం గుర్తించింది. అంతేకాకుండా, రక్తస్రావం వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగినట్లు స్పష్టమైంది. రోగిని ఉన్నత వైద్య సదుపాయాలు ఉన్న ఆసుపత్రికి తరలించడంలో కూడా జాప్యం జరిగినందున, ఇది స్పష్టమైన వైద్య నిర్లక్ష్యంగా ఫోరం అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ₹2.45 లక్షలు, సంబంధిత ప్రైవేట్ ఆసుపత్రి డైరెక్టర్ మరియు వైద్యుడు కలిసి ₹13,40,189 మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఫోరం ఆదేశించింది. అదనంగా, కేసు ఖర్చుల కింద ₹50,000ను కూడా బాధిత కుటుంబానికి ఇవ్వాలని పేర్కొంది.
ఈ మొత్తాన్ని 45 రోజులలోగా చెల్లించాలని స్పష్టం చేసిన ఫోరం, గడువు లోపల చెల్లించకపోతే మొత్తం పరిహారంపై వార్షికంగా 10 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రులు ప్రామాణిక వైద్య విధానాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
ఈ తీర్పు వైద్య సేవల్లో నాణ్యత, జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తుచేస్తోంది. రోగుల ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని, వైద్యులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications