మోడీ నేపాల్ టూర్: ప్రజాస్వామ్యానికి ప్రమాదం: కాంగ్రెస్ నేత ఆశోక్ గెహ్లాట్
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి మోడీ నేపాల్లో దేవాలయాల సందర్శన ఓటర్లను ప్రభావితం చేసేందుకేనని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్ ఈ విషయమై నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు.
ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదని ఆయన చెప్పారు. ఇవాళలనే నేపాల్ పర్యటన కోసం ప్రధాని ఎందుకు ఎంచుకొన్నారని ఆయన ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో చెడు సంప్రదాయాలకు ఇది సంకేతమని గెహ్లాట్ ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ రెండు రోజు పాటు నేపాల్ పర్యటన కోసం శుక్రవారం నాడు నేపాల్ వెళ్ళారు.

ఇండియా, నేపాల్ దేశాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు ఇతర అంశాలపై ప్రధానమంత్రి మోడీ ఈ పర్యటనలో నేపాల్ తో చర్చించనున్నారు. అంతేకాదు నేపాల్ లోని ప్రసిద్ద ముక్తినాద్, జానకిపూర్ ఆలయాన్ని కూడ ఆయన సందర్శించారు. ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ మేరకు ఈ రెండు దేవాలయాల్లో పూజల నిర్వహణ అంశం కర్ణాటకలో శనివారం నాడు జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది పోలింగ్ నిబంధనావళికి విరుద్దమని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications