విశ్వాస పరీక్ష తర్వాత బిజెపి తీరు బహిర్గతంకానున్నాయి: వీరప్ప మొయిలీ
బెంగుళూరు: కర్ణాటక విశ్వాస పరీక్షల తర్వాత బిజెపి తీరు ప్రపంచానికి బహిర్గతం కానుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు.
మే 19వ తేది సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప విశ్వాస పరీక్ష జరగనుంది. ఈ విశ్వాస పరీక్షలో విజయం సాధిస్తామని బిజెపి ధీమాగా ఉంది. మరో వైపు కాంగ్రెస్. జెడి(ఎస్) కూటమి కూడ విజయంపై ధీమాగా ఉంది.
అయితే కర్ణాటక అసెంబ్లీలో 104 మంది ఎమ్మెల్యేల బలం బిజెపికి ఉంది. కాంగ్రెస్ పార్టీకి 78 మంది సభ్యులున్నారు. జెడి(ఎస్)కు 38 మంది సభ్యులున్నారు.అయితే విశ్వాసపరీక్షను కర్ణాటలో ఈ రెండు పార్టీలు కూడ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా అసెంబ్లీకి హజరుకాలేదన్నారు. తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరైతే తప్పకుండా తమకే ఓటు చేస్తారని కాంగ్రెస్ పార్టీ నేత వీరప్పమొయిలీ ధీమాను వ్యక్తం చేశారు.శనివారం నాడు మధ్యాహ్నాం ఆయన మీడియాతో మాట్లాడారు.
కర్ణాటక విశ్వాస పరీక్షను కాంగ్రెస్ పార్టీ కూడ సీరియస్ గా తీసుకొంది. బిజెపిని ఈ విశ్వాస పరీక్షలో ఓడించాలని కాంగ్రెస్ పార్టీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. విశ్వాస పరీక్షలో విజయం సాధించేందుకు బిజెపి ఏ రకమైన ప్రయత్నాలు చేసిందనే విషయాలను ఇప్పటికే ప్రపంచానికి తెలిశాయని కాంగ్రెస్ నేత మొయిలీ గుర్తు చేశారు. విశ్వాస పరీక్ష తర్వాత ఆ పార్టీ తీరు ప్రపంచం ముందు బహిర్గతం కానుందన్నారు.