హిజాబ్ ధరించే వారిని గౌరవంగా చూడాల్సిందే-సుప్రీంలో పిటిషనర్ల వాదన
హిజాబ్ ధరించిన మహిళలను వ్యంగ్య చిత్రాలుగా చూడకూడదని, వారిని గౌరవంగా చూడాలని పిటిషనర్లు అయిన విద్యార్ధినులు సుప్రీంకోర్టును కోరారు. కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా వారు సుప్రీంకోర్టును ఈ మేరకు అభ్యర్దించారు.
"హిజాబ్ ధరించిన స్త్రీలను వ్యంగ్య చిత్రాలుగా చూడకూడదు. వారిని గౌరవంగా చూడాలి. వారు దృఢ సంకల్పం గల స్త్రీలు, దీని వల్ల తమకు అధికారం లభించిందని వారు భావిస్తారు. వారి తీర్పులను ఎవరూ వారిపై విధించలేరు' అని సీనియర్ న్యాయవాది యూసుఫ్ ముచ్చాల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలని న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనాన్ని కూడా ఆయన కోరారు. కేవలం తలపై గుడ్డ ధరించారన్న కారణంతో విద్యను తిరస్కరించడం సబబు కాదని వాదించారు.

హిజాబ్ ధరించిన విద్యార్థులకు ప్రవేశం నిరాకరించడం వల్ల విద్య, వ్యక్తిగత గౌరవం, గోప్యతతో పాటు మతాన్ని ఆచరించే ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లిందని సీనియర్ న్యాయవాది వాదించారు. మనస్సాక్షికి హక్కు, మతాన్ని ఆచరించే హక్కు పరస్పర విరుద్ధమని హైకోర్టు చెప్పిందని జస్టిస్ గుప్తా అన్నారు. విచారణ సందర్భంగా, ఖురాన్ యొక్క వ్యాఖ్యానంలోకి హైకోర్టు వెళ్లకూడదని లాయర్ ముచ్చల వాదించారు.












Click it and Unblock the Notifications