పంద్రాగస్టు అపశృతులు: సొమ్మసిల్లిన గవర్నర్, కుప్పకూలిన మంత్రి
ఛండీగఢ్/బెంగళూరు: స్వాతంత్ర్య దినోత్సవం రోజు పలు చోట్ల చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకున్నాయి. వేడుకల సందర్భంగా ప్రసంగిస్తూ ఓ మంత్రి కుప్పకూలిపోగా, మరో వేడుకలో గవర్నర్ సోమ్మసిల్లి పడిపోయారు. ఒకరు కర్ణాటకకు చెందిన మంత్రి కాగా, మరొకరు హర్యానా గవర్నర్.
ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో రెవెన్యూ శాఖ మంత్రి కాగోడు తిమ్మప్ప(83) పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. గమనించిన అధికారులు వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు.. మంత్రి తిమ్మప్ప ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తిమ్మప్ప కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడారు.
మరో ఘటనలో..
సోమవారం ఉదయం స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన హర్యా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి అస్వస్థతకు గురయ్యారు. వేదికపై ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో సోలంకి పోడియం వద్ద అస్వస్థతకు గురై సొమ్మసిల్లిపోయారు. అది గమనించిన సిబ్బంది ఆయనను కూర్చోబెట్టి నీరందించారు. అనంతరం వైద్యులు గవర్నర్ను పరీక్షించారు. వాతావరణం చాలా వేడిగా ఉండటం వల్ల సోలంకి సొమ్మసిల్లారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.