మేం ప్రభుత్వాన్ని నడపట్లేదు-మేనేజ్ చేస్తున్నామంతే.. మంత్రి గారి ఆడియో లీక్...
" మేం ప్రభుత్వాన్ని నడపడం లేదు.. కేవలం మేనేజ్ చేస్తున్నామంతే.. " ఓ మంత్రి గారి నుంచి ఈ వ్యాఖ్య వచ్చిందంటే అక్కడ ప్రభుత్వం ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మన పొరుగు రాష్ట్రంలోనే మంత్రి గారు చెప్పిన ఈ వ్యాఖ్యల ఆడియో లీక్ అయి వైరల్ అవుతోంది.
కర్ణాటకలో న్యాయశాఖ మంత్రి మధుస్వామి చేసిన వ్యాఖ్యలు పత్రికలకు లీక్ కావడంతో సీఎం బసవరాజ్ బొమ్మైకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఈ వ్యాఖ్యలు వాస్తవమేనని, అయితే సందర్భం మాత్రం వేరని బొమ్మై వీటిని వెనకేసుకొచ్చారు. "మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు, మేనేజ్ చేస్తున్నాం" అని కర్ణాటక న్యాయ శాఖ మంత్రి జేసీ మధుస్వామి ఆడియో క్లిప్లో చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

62 ఏళ్ల బొమ్మై తన పాలనపై పెరుగుతున్న అసంతృప్తి కారణంగా త్వరలో బీజేపీ అధిష్టానం ఆయన్ను తప్పించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ చేతుల్లో లేదనే అర్ధం వచ్చేలా మధుస్వామి చేసిన వ్యాఖ్యలు బొమ్మైకు ఇబ్బందికరంగా మారాయి. అయితే వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోబోతున్న కర్నాటకలో బొమ్మైపై వ్యతిరేకత పెరుగుతుండటాన్నిబీజేపీ అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. అదే సమయంలో ఈ ఆడియో లీక్ రావడంతో రాబోయే రోజుల్లో సీఎం పదవిలో బొమ్మై స్ధానంలో మరొకరు రాబోతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో అతివాద హిందూ చర్యలతో వివాదాలు తెస్తున్న బొమ్మై విషయంలో వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా బెంగళూరు ఇమేజ్ దెబ్బతీస్తున్నారన్న విమర్శలు ఆయనపై వచ్చాయి.












Click it and Unblock the Notifications