నేను అమాయకుడిని, ఆ చిన్నారికి తాత లాంటివాడిని: కథువా నిందితుడు సాంజీరామ్
న్యూఢిల్లీ: కథువా రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాంజీరామ్ తాను అమాయకుడినని, ఘటనతో తనకేమి సంబంధం లేదని, కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. అంతేకాదు, ఆ చిన్నారికి తాను తాత లాంటివాడినని అతను పేర్కొనడం గమనార్హం.
కేసును చంఢీఘర్ ట్రయల్ కోర్టుకు బదిలీ చేయాలన్న బాధితురాలి తండ్రి ప్రతిపాదనను సాంజీరామ్ వ్యతిరేకించాడు. కేసు విచారణలో పారదర్శకత లోపించిందని, పోలీసులు సరైన రీతిలో విచారణ జరపడం లేదని సాంజీరామ్, మరో నిందితుడు విశాల్ జంగోత్ర అఫిడవిట్ లో పేర్కొన్నారు. సిట్ అధికారుల దర్యాప్తు సైతం సరైన రీతిలో సాగడం లేదని వారు ఆరోపించారు.
కేసును చంఢీఘర్ బదిలీ చేస్తే.. సాక్ష్యులుగా ఉన్న 226మందిని అక్కడికి తీసుకెళ్లడం అసాధ్యమని, కాబట్టి కేసును అక్కడికి బదిలీ చేయవద్దని కోరారు. కేసును విచారించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణకు కళంకం తెచ్చారని, కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
బాధితులకు న్యాయం జరగాలంటే కేసును సీబీఐకి గానీ లేదంటే ఏదైనా స్వతంత్ర విచారణ సంస్థకు గానీ అప్పగించాలని నిందితులు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రాణ హాని ఉందన్న ఆరోపణల్లోనూ ఎటువంటి నిజం లేదని, దానికి సంబంధించి ఏ ఆధారమూ లేదని వారు పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబసభ్యులకు, వారి తరుపు న్యాయవాది దీపికా సింగ్ రాజావత్ కు రక్షణ కల్పించడాన్ని వారు తప్పుపట్టారు. దీపికాసింగ్ కోసం నియమించిన భద్రతా సిబ్బందిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది న్యాయ ప్రక్రియను కించపర్చడం లాంటిదేనని ఆరోపించారు.