గెలుపే లక్ష్యం: పాత ఫ్రెండ్స్తో ప్రధాని మోదీ ఫోన్ కాల్స్
వచ్చే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ భిన్నమైన వ్యూహాల్లో ప్రచారం చేస్తున్నారు.
గాంధీనగర్: వచ్చేనెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందుకు సాగుతున్నారు. అందుకు అన్ని అవకాశాలను, ఆప్షన్లను వినియోగించుకుంటున్నారు. చిన్న నాటి స్నేహితులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత, ఓబీసీ కోటాలో రిజర్వేషన్ల కోసం పాటిదార్ల ఆందోళన, అదే ఓబీసీ హక్కుల పరిక్షణ కోసం క్షత్రియులు, ఇతర ఓబీసీ వర్గాల పోరాటం, అణచివేతకు వ్యతిరేకంగా, ఉనాలో దాడులకు వ్యతిరేకంగా దళితుల ఆందోళనకు తోడు వ్యవసాయ రంగంలో సంక్షోభం, నిరుద్యోగ సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ తన చిన్ననాటి స్నేహితులు మొదలు ప్రతి ఒక్క మిత్రుడికి ఫోన్ కాల్స్ చేశారు. ప్రతి రోజూ ఎనిమిది మంది నుంచి పది మంది స్నేహితులకు ఫోన్ కాల్స్ చేస్తూ క్షేమ సమాచారం అందజేశారు. తదుపరి 'నమో' యాప్ ద్వారా స్నేహితులతో భేటీ కావాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

బీజేపీ శ్రేణులతో క్షేమసమాచారంపై ఆరా ఇలా
‘హలో, ఇటువైపు నుంచి ప్రధాని లైన్లో ఉన్నారు' అని ప్రధాని నరేంద్రమోదీ నుంచి ఫోన్ కాల్స్ చేస్తూ క్షేమ సమాచారాలు కనుక్కుని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా సాగుతున్నారు. అందుకోసం క్షేత్రస్థాయిలో ఎంపిక చేసిన బీజేపీ శ్రేణుల ద్వారా ఆయా స్నేహితుల ఫోన్ నంబర్లు తెలుసుకుని సంప్రదిస్తూ ముందుకు సాగుతున్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఎదుర్కొనేందుకు సంసిద్ధం అవుతున్నారు. బీజేపీలో ప్రజల హ్రుదయ నేతగా ప్రధాని నరేంద్రమోదీ ప్రజాకర్షణ నాయకుడి డిజిటల్ స్థాయితో ఇన్నోవేటివ్ టెక్నిక్లతో ‘3డీ' హోలోగ్రాఫిక్ ప్రచారం చేపట్టారు. తర్వాత 2014 ఎన్నికల్లో ‘చాయ్ పే చర్చ' పేరిట ప్రజలతో ఇష్టాగోష్టి చర్చల ద్వారా విజయం సాధించారు.

పాత సంబంధాల పునరుద్ధరణతో ఇదీ ప్రయోజనం
‘ ప్రధాని నరేంద్రమోదీతో ఈ వ్యక్తిగత ఫోన్ కాల్స్ చేయడం వల్ల ఇటు బీజేపీలోనూ, గుజరాతీల్లోనూ భారీగా ప్రభావం చూపుతుంది. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం వల్ల పార్టీ కార్యకర్తల్లో నూతన జవసత్వాలు కల్పిస్తుంది. రాహుల్ గాంధీ మాదిరిగా జన నేతగా రుజువు చేసుకునేందుకు వెసులుబాటు కలిగిస్తుంది' అని బీజేపీ మీడియా సెల్ ఇన్చార్జి హర్షద్ పటేల్ చెప్పారు. ప్రజలు, మిత్రుల పట్ల స్నేహ పూర్వక వైఖరి ప్రదర్శిస్తూ.. పాత కాలం నాటి స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు తద్వారా భావోద్వేగాలను రగిల్చేందుకు ప్రధాని మోదీ ఫోన్ ఫ్రెండ్లీ వ్యూహం అమలు చేస్తున్నారని కమలనాథులు చెప్తున్నారు. తద్వారా 2001 నుంచి 2014 సీఎంగా పనిచేసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై పెట్టుకున్న ఆశలను సజావుగా నిలిపేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.

రాహుల్ ప్రచారానికి పెరుగుతున్న ప్రజాదరణ ఇలా
దీంతో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణను తగ్గించేందుకు ప్రధాని మోదీ ఫ్రెండ్లీ వ్యూహం అమలు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ప్రగతి పిచ్చిగా మారిందని రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారానికి భారీగా ప్రజాదరణ లభిస్తున్నది. రాహుల్ గాంధీపై దూకుడుగా ప్రచారం చేయాలన్నది మోదీ లక్ష్యం. ఇటీవల రాజ్ కోట్లో జామ్ నగర్ వద్ద పార్టీ కార్యకర్త కుటుంబం ఇంట్లో మంచంపై కూర్చుని టీ తాగడం సామాన్యులను ఆకర్షిస్తోంది. దీనికి ప్రతిగా ప్రతి రోజూ ఇద్దరు పార్టీ కార్యకర్తలతో ప్రధాని మోదీ ఫోన్ కాల్స్ ఆడియో క్లిప్పింగ్స్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వడోదర పట్టణంలోని 13వ వార్డు బీజేపీ ప్రధాన కార్యదర్శి గోపాల్ గోహిల్ అనే వ్యాపారి ఫోన్ కాల్ క్లిప్ను ముందుగా పోస్ట్ చేశారు.

జన్ సంఘ్ స్థాపించినప్పటి నుంచి దుర్భాషలే
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతికూల ప్రచారం చేయొద్దని బీజేపీ నేతలకు ప్రధాని మోదీ సూచిస్తున్నారు. గతంలో మ్రుత్యు బేహరీ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన ప్రధాని.. తాను గుజరాత్ రాష్ట్ర ప్రగతి కోసం ఎంతో క్రుషి చేస్తున్నానని చెప్పారు. ‘జన్ సంఘ్ స్థాపించినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు మేం దుర్భాషలను ఎదుర్కొంటున్నాం. కానీ నీవు దాని గురించి ఆందోళనకు గురి కావద్దు. ఎన్నికలు ఎప్పుడు ఎక్కడ జరిగినా అబద్దాలు ప్రచారం చేయకూడదు' అని ప్రధాని మోదీ హితవు చెప్తున్నారు.
‘నా చేతులు రక్తంతో తడిశాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఇంతకుముందు నోటి ద్వారా వదంతులు వ్యాపించజేసేవారు. ఇప్పుడు అందుకు వాట్సప్ తదితర సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు' అని మోదీ అభిప్రాయ పడ్డారు.

ప్రధాని మోదీ కాల్స్తో కార్యకర్తల్లో హర్షాతిరేకాలు
ఒక వ్యక్తిపై పాజిటివ్ అంశం గురించి చర్చించిన తర్వాత పార్టీ విజయానికి పని చేస్తానని గోహిల్ ప్రదాని మోదీకి హామీ ఇచ్చారు. స్టేషనరీ షాపుతో జీవనం సాగిస్తున్న గోహిల్ ను ఆయన వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఒత్తిడితో కూడిన షెడ్యూల్ ఉన్నా ప్రధాని మోదీ తన మాదిరిగా చిన్న పార్టీ కార్యకర్తలతో మాట్లాడటం మరిచిపోలేకున్నాం. తమ తరానికి ఇది గర్వ కారణమని గోహెల్ వ్యాఖ్యానించాడు.

కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపణ
దక్షిణ వల్సాద్ జిల్లాలోని ధరంపూర్ వాసి సుమిత్రాబెన్ కు కాల్ చేసిన ప్రధాని మోదీ.. సుదీర్ఘ కాలం క్రితం తనకు అందించిన ఆమె ఆతిథ్యం మరిచిపోలేనని పొగిడాడు. కాంగ్రెస్ కులప్రాతిపదికన చేసే రాజకీయాలను తోసిపుచ్చాలని పేర్కొన్న ప్రధాని.. మిగతా కార్యకర్తల పేర్లు గుర్తు చేశాడని ఆమె చెప్పారు. సీఎంగా ఎన్నికవ్వక ముందు క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధ బాంధవ్యాలు సాగించేందుకు ఇదే వైఖరి ప్రదర్శించే వారు. 182 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రధాని మోదీ ఇటువంటి ఫోన్ కాల్స్ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్ కాల్స్ ప్రక్రియ గత దీపావళి నుంచి ప్రారంభమైందని, ఇప్పటివరకు ఫోన్ కాల్స్ ద్వారా 25 వేల మంది బీజేపీ కార్యకర్తలతో మాట్లాడగలిగారని బీజేపీ పేర్కొన్నది. ఒక కార్యకర్తకు చేసే ఫోన్ కాల్ ‘కాన్ఫరెన్స్' ద్వారా మిగతా వారికి వినిపిస్తుందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications