కేంద్రమంత్రిపై కేజ్రీ కేసు, సిబిఐ లక్ష్మీనారాయణకు వెల్కం
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి, మరో మాజీ మంత్రి, రిలయన్స్ అధినేతపైనే కేసు పెట్టాలని ఆదేశించారు. కెజి బేసిన్ గ్యాస్ ధర పెంపులో కుట్ర జరిగిందన్న ఆరోపణలకు సంబంధించి పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ, మాజీ మంత్రి మురళీ దేవ్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీలపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి మంగళవారం ఎసిబిని ఆదేశించారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ధర అమలు నిర్ణయాన్ని నిలిపేయాలని కేంద్రాన్ని కోరారు. అవినీతి నిరోధక చట్టం నిబంధనల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని తమ ప్రభుత్వ పరిధిలోని ఎసిబిని ఆదేశించినట్లు మీడియా సమావేశంలో కేజ్రీవాల్ వెల్లడించారు. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పార్టీ హయాంలో అవినీతి వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశిస్తుండటం చర్చనీయాంశమైంది. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్ పనుల్లో అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజాగా కేబినెట్ మాజీ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రమణ్యన్, న్యాయవాది కామినీ జైశ్వాల్ తదితరులు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏకంగా కేంద్రం పెద్దలు, కార్పోరేట్ దిగ్గజం పైనే కేసు పెట్టాలని ఆదేశించడం గమనార్హం. ఫిర్యాదులోని అంశాలు తీవ్రంగా ఉన్నాయని, కేంద్ర మంత్రులు, అధికారులు, ఆర్ఐఎల్ కలిసి దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా కుట్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని కేజ్రీవాల్ తెలిపారు.
సిబిఐ లక్ష్మీ నారాయణకు ఎఎపి వెల్కం
సిబిఐ మాజీ జెడి, ప్రస్తుత ఐజి లక్ష్మీ నారాయణకు ఎఎపి నుండి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని లక్ష్మీ నారాయణ విజయనగరం జిల్లాలో మంగళవారం చెప్పారు. ఎఎపి వాళ్లు తనను సంప్రదించారని, ఈ రాష్ట్రంలో నాయకత్వం వహించాలని కోరారని, దానిపై ఆలోచిస్తున్నానని తెలిపారు.