కేజ్రీవాల్ సర్కార్ సంచలనం: ఢిల్లీలో దీపావళి బాణాసంచా తయారీ, సేల్స్, కాల్చటం పూర్తిగా నిషేధం, రీజన్ ఇదే !!
దేశ రాజధాని ఢిల్లీలో పూర్తిగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయించడం, కాల్చడం నిషేధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో అన్ని రకాల టపాసులను నిల్వ చేయడం, విక్రయించడం , పేల్చడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. గత మూడు సంవత్సరాలలో దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో విపరీతమైన కాలుష్యం పెరిగిపోవడంతో, ప్రస్తుత కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం .. నివారణా చర్యల్లో కేజ్రీ సర్కార్
దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్తో సమావేశమైన తర్వాత ఈ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక తాజా నిర్ణయానికి సంబంధించి ఢిల్లీ పర్యావరణ మంత్రి కార్యదర్శి, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రైవేట్ సెక్రటరీకి లేఖ రాశారు.
దేశ రాజధాని ఢిల్లీలో విపరీతమైన పర్యావరణ కాలుష్యం ఉన్నమాట తెలిసిందే. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు వ్యవసాయం తర్వాత పంటల అవశేషాలను తగలబెట్టటంతో, పంటల కోత కోసిన తర్వాత, మిగిలిన పంటపొలాలను దగ్ధం చేయడం వల్ల విపరీతమైన పొగ కారణంగా కాలుష్యం పెరిగిపోతుందని గుర్తించిన కేజ్రీవాల్ ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించడానికి అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తాజా నిర్ణయం తీసుకుంది . ఇదే సమయంలో పంటలను తగలబెట్టకుండా పుసా బయో డీకంపోజర్ ను ఉపయోగిస్తోంది.
ముందస్తుగా బాణాసంచా పై సంపూర్ణ బ్యాన్ విధించిన ఢిల్లీ ప్రభుత్వం
గత సంవత్సరం, వ్యాపారులు టపాసులు అమ్మకానికి నిల్వ చేసిన తర్వాత నిషేధం విధించబడింది, దీని వలన వారికి నష్టం జరిగింది. సంపూర్ణ నిషేధాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుండే టపాసులను నిల్వ చేయవద్దని నేను వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ ప్రారంభంతో వాయు కాలుష్య స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున, ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం అన్ని సంబంధిత విభాగాలను సెప్టెంబర్ 21 లోగా శీతాకాలపు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించింది.
పంట పొలాల్లో అవశేషాలను తగలబెత్తకుండా చర్యలు
ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ మంత్రికి పుసా బయో డీకంపోజర్ ఆడిట్ నివేదిక ద్వారా 15-20 రోజుల్లో పంట పొలాల్లో మిగిలిపోయిన చెత్తను ఎరువుగా మారుతుందని, పుసా బయో డీకంపోజర్ సమర్థవంతంగా పనిచేస్తుందని, దానిని రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలను ఆదేశించమని విజ్ఞప్తి చేస్తానని పేర్కొన్నారు. సెంట్రల్ ఏజెన్సీ ఆడిట్లో పూసా బయో-డీకంపోజర్ వాడకం అత్యంత ప్రభావవంతమైనదని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.అదే సమయంలో, ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సిఆర్) లో వాయు కాలుష్యాన్ని పరిష్కరించే లక్ష్యంతో, పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్లో పంట పొలాల్లో మిగిలిపోయిన చెత్త తగలబెట్టకుండా కేంద్రంలో అవసరమైన యంత్రాలకు సబ్సిడీ ఇవ్వడానికి కేంద్రం రూ .496 కోట్లు విడుదల చేసింది. పంట పొలాలలో మిగిలిపోయిన అవశేషాల నిర్వహణకు యంత్రాలను కొనుగోలు చేసి వాటిని నాశనం చేయాలని, తగలబెట్ట కూడదని సూచిస్తోంది.
ఇప్పటికే కేంద్రం పంటలు తగలబెట్టకుండా నాశనం చేసేలా యంత్రాలకు సబ్సిడీ
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, 2021 సమయంలో పంట అవశేషాల నిర్వహణకు అవసరమైన యంత్రాలకు సబ్సిడీ ఇవ్వడానికి నాలుగు రాష్ట్రాలు-ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్ కోసం కేంద్రం రూ .496 కోట్లను విడుదల చేసినట్లు తెలియజేసింది. "2021-22 సంవత్సరానికి పంజాబ్కు రూ .235 కోట్లు, హర్యానాకు రూ .114 కోట్లు, ఉత్తర ప్రదేశ్కు రూ .115 కోట్లు, ఢిల్లీకి రూ .5 కోట్లు విడుదలయ్యాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు ఇతర కేంద్ర ఏజెన్సీలు కూడా రూ. 54.99 కోట్లు అందుకున్నాయి అని అగర్వాల్ తెలియజేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ..సుప్రీంలో సవాల్
ఈ ఏడాది జూలైలో, సుప్రీంకోర్టులో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టి వేసిన విషయం తెలిసిందే. నగరాల్లో కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అన్ని టపాసుల అమ్మకం మరియు వాడకంపై పూర్తి నిషేధం విధించింది. ఇక దీనిపై తదుపరి స్పష్టత లేదా చర్చ అవసరం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది .జస్టిస్ ఎఎమ్ ఖాన్విల్కర్ మరియు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఎన్జిటి తన ఆర్డర్లో ఇప్పటికే ఈ సమస్యను నిర్ణయించిందని, తదుపరి స్పష్టత లేదా చర్చ అవసరం లేదని చెప్పారు.
టపాసుల తయారీపై సుప్రీం ఆదేశాలు .. పూర్తి బ్యాన్ విధిస్తూ ఢిల్లీ సర్కార్ నిర్ణయం
నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) కేటగిరీ ప్రకారం మాత్రమే టపాసుల అమ్మకం మరియు వినియోగాన్ని అధికారులు అనుమతించవచ్చని పేర్కొంది. టపాసుల తయారీ లేదా ఉత్పత్తి అనుమతించబడుతుందని మరియు AQI కేటగిరీని బట్టి బాణసంచాను ఉపయోగించాలనుకునే వారు అనుమతితో అలా చేయవచ్చని బెంచ్ తెలిపింది.
గాలి నాణ్యత తక్కువగా ఉన్న ప్రదేశాలలో నిషేధం ఉందని మరియు తయారీపై నిషేధం లేదని ఇది స్పష్టం చేసింది. అయితే తాజాగా ఢిల్లీలో ఉన్న విపరీతమైన వాయుకాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో పూర్తిగా బాణాసంచా తయారీని, అమ్మకాలను, వినియోగించడాన్ని బ్యాన్ చేస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.