ఉచిత కరోనా వ్యాక్సిన్: దేశంలో మూడో రాష్ట్రంగా కేరళ, సీఎం కీలక ప్రకటన
తిరువనంతపురం: కరోనా విజృంభిస్తున్నవేళ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు విజయన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ లభ్యత గురించే ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కోసం ఛార్జీలు విధించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని పినరయి విజయన్ స్పష్టం చేశారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సభలకు హాజరుకాకపోవడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపైనా సీఎం విజయన్ స్పందించారు.

ప్రచారం అంటే ప్రజలను సమీకరించడమని, ఈ కరోనా మహమ్మారి సమయంలో ఇది వాంఛనీయం కాదని ఆయన అన్నారు. తాను సమావేశాలకు హాజరైతే పెద్ద ఎత్తున జనం గుమిగూడుతారన్నారు. తన ఎన్నికల ప్రచారం ఆన్లైన్లో కొనసాగుతోందని తెలిపారు. తాను ప్రజలకు దూరం కాలేదని, వారూ తనను దూరం చేసుకోలేదని విజయన్ వ్యాఖ్యానించారు.
కాగా, గత 24 గంటల్లో 59,690 నమూనాలను పరీక్షించగా.. 5949 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో 5268 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కేరళలో మొత్తంగా 6.64 లక్షల మందికి కరోనా సోకింది. వీరిలో 6.01 లక్షల మందికి పైగా కోలుకున్నారు. గత 24 గంటల్లో మరో 32 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2594కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 60,029 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన రాష్ట్రాల్లో కేరళ మూడోది కావడం గమనార్హం. ఇప్పటికే తమిళనాడు సీఎం పళనిస్వామి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే ప్రజలకు ఉచితంగానే పంపిణీ చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications