Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..!
కేరళలో (Kerala) ఈ నెల 9న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ్టికి నాలుగు రోజులు గడిచిపోయింది. అయినా ఇప్పటికీ కేరళ అసెంబ్లీ ఎన్నికల పూర్తి గణాంకాల్ని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఈసీ విడుదల చేస్తున్న గణాంకాలపై అనుమానాలు నెలకొంటున్న వేళ.. ఇప్పుడు కేరళలో ఏకంగా పోలింగ్ వివరాలు బయటపెట్టకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
కేరళలో పోలింగ్ ముగిసిపోయి నాలుగు రోజులవుతున్నా ఇంకా ఈసీ వివరాలు బయటపెట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీషన్ ఎన్నికల సంఘానికి ఇవాళ లేఖ రాశారు. ఇందులో ఆయన.. శాసనసభ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను వెంటనే విడుదల చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి, పోలింగ్ శాతం, పోస్టల్ ఓటింగ్ స్టేటస్ కు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో ప్రచురించాలని కూడా వీడీ సతీషన్ డిమాండ్ చేశారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పారావూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా వీడీ సతీషన్ పోటీ చేశారు. అలాగే ఆయన ఇప్పటివరకూ కేరళ అసెంబ్లీలో విపక్ష నేతగా కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఈసారి యూడీఎఫ్ విజయం సాధిస్తే సతీషన్ ముఖ్యమంత్రి అభ్యర్ధి రేసులో ముందంజలో ఉన్నారు. దీంతో సతీషన్ ఈసీకి రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఈసీ తుది పోలింగ్ శాతం విడుదల చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications