కేరళ భవన్ లో బీఫ్ లేదు: బర్రె మాంసం ఉంది
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేరళ భవన్ క్యాంటిన్ లో గోమాంసం వడ్డించడం లేదని, బర్రె మాంసం మాత్రం వడ్డిస్తున్నామని కేరళ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మంగళవారం కేరళ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బి.జీ. థామస్ మీడియాతో మాట్లాడారు.
కేరళ భవన్ క్యాంటిన్ లో ఇప్పటి వరకు ఆవు మాంసం వండలేదని, కేవలం బర్రె మాంసం మాత్రమే అందిస్తున్నామని వివరణ ఇచ్చారు. అనుమతి లేకుండా కేరళ భవన్ లోకి చొరబడిన శ్రీరామ సేన కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు.
కేరళ భవన్ క్యాంటిన్ లోని మెనులో అన్ని ఆహార పదార్థాల పేర్లు ఇంగ్లీష్ లో ఉన్నాయి. అయితే బీఫ్ అనే పదం మాత్రం మలయాళంలో వ్రాసి ఉంది. విషయం తెలుసుకున్న శ్రీరామ సేన కార్యకర్తలు సోమవారం సాయంత్రం కేరళ భవన్ లోకి చొరబడ్డారు.

ఆవు మాంసం ఉండరాదని అక్కడి సిబ్బందిని హెచ్చరించారు. సిబ్బంది పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేరళ భవన్ చేరుకున్నారు. అప్పటికే శ్రీరామ సేన కార్యకర్తలు పరారైనారు.
పోలీసులు క్యాంటిన్ లో ఆవు మాంసం వండుతున్నారా అని పూర్తిగా పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు.
అనుమతి లేకుండ పోలీసులు కేరళ భవన్ క్యాంటిన్ లో సోదాలు చేశారని విమర్శించారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఢిల్లీ పోలీసుల తీరుపై విచారం వ్యక్తం చేశారు. కేరళ భవన్ లోని సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ సూచించారు.












Click it and Unblock the Notifications