జమిలి బిల్లులు నెగ్గడం కష్టమేనా ? కీలక సవాళ్లు-కేంద్రం ఏం చేయబోతోంది ?
దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్రం ఇవాళ రెండు కీలక బిల్లుల్ని లోక్ సభలో ప్రవేశపెట్టింది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లుల్ని నెగ్గించుకోవాలంటే కనీసం మూడింటి రెండొంతుల మెజార్టీ అవసరమైన పరిస్ధితుల్లో విపక్షాల్ని ఒప్పిస్తే కానీ జమిలి బిల్లులకు ఆమోదం లభించడం కష్టమే. ఈ నేపథ్యంలో జమిలి బిల్లులు పెట్టగానే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతామంటూ కేంద్రం సన్నాయి నొక్కులు ప్రారంభించేసింది. ఇదంతా చూస్తుంటే అసలు జమిలి బిల్లుల్ని నెగ్గించుకోవడం అసాధ్యమేనా అన్న చర్చ మొదలైంది.
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ చేయక తప్పని పరిస్ధితుల్లో కేంద్రం ఇవాళ రెండు రాజ్యాంగ సవరణ బిల్లుల్ని లోక్ సభలో ప్రవేశపెట్టింది. వీటిని నెగ్గించుకోవాలంటే లోక్ సభ, రాజ్యసభలోనూ 2/3 వంతు మెజార్టీ అవసరం. ఈ లెక్కన చూస్తే లోక్ సభలో 362 ఓట్లు, రాజ్యసభలో 158 ఓట్లు అవసరమవుతాయి. అయితే ప్రస్తుతం లోక్ సభలో కేంద్రానికి 298 ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. అంటే 64 ఓట్లు తక్కువ. అలాగే రాజ్యసభలో 135 ఎంపీలే ఉన్నారు. ఇక్కడా మరో 23 మంది ఎంపీల అవసరం ఉంది.

అలాగే జమిలి బిల్లులు గట్టెక్కాలంటే ఇరు సభల్లోనూ 50 శాతం ఓటింగ్ తప్పనిసరి. అలాగే 50 శాతం రాష్ట్రాల మద్దతు కూడా అవసరం. ఈ లెక్కన చూస్తే ఇండియా కూటమి మద్దతు లేకుండా జమిలి బిల్లులు గట్టెక్కడం అసాధ్యమని తేలిపోతోంది. ఈ నేపథ్యంలో జమిలి బిల్లులు వెనక్కి తీసుకోవాలని ఇండియా కూటమి తొలిరోజే డిమాండ్ చేయడం మొదలుపెట్టేసింది. కానీ కేంద్రం మాత్రం జేపీసీకి పంపుతామని చెబుతోంది. ఇవాళ విపక్షాల నిరసనలతో బిల్లులు పెట్టాక కూడా వీటిపై తొలిసారి లోక్ సభలో ఈ-ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో 269 మంది ఎంపీల మద్దతుతో కేంద్రం ప్రతిపాదన నెగ్గింది.
ప్రస్తుతం లోక్ సభలో ఉన్న పార్టీల్లో 32 పార్టీలు జమిలి ఎన్నికల బిల్లుకు మద్దతిస్తున్నాయి. మరో 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే పార్టీల బలాబలాల ఆధారంగా చూస్తే మాత్రం జమిలి బిల్లులకు మెజార్టీ మద్దతు లభించడం లేదు. దీంతో ప్రస్తుతం లోక్ సభలో చర్చ చేపట్టి జేపీసీకి వీటిని పంపేందుకు కేంద్రం సిద్దమవుతోంది. అనంతరం విపక్ష పార్టీల్ని చీల్చడం లేదా లాబీయింగ్ ద్వారా ఒప్పించడమో చేస్తే తప్ప జమిలి బిల్లుల్ని కేంద్రం నెగ్గించుకునే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications