లక్షదీవుల్లో తీవ్రమవుతున్న ప్రజాగ్రహం- అడ్మినిస్ట్రేటర్ రీకాల్ కోరుతూ జనం నిరాహారదీక్షలు
లక్షద్వీప్లో ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్కు వ్యతిరేకంగా ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. అభివృద్ధి పేరుతో అక్కడి ప్రజల ఇష్టాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రఫుల్ పటేల్ను రీకాల్ చేయాలనే డిమాండ్తో నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ స్ధానికులు ఇదే డిమాండ్తో ఏకంగా నిరాహారదీక్షలకు దిగారు.
లక్షద్వీప్లో స్ధానికుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ప్రజల్లో వాటిపై ఆగ్రహం వెల్లువెత్తుతున్నా వెనక్కి తగ్గేందుకు నిరాకరిస్తున్న అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ను కేంద్రం తక్షణం రీకాల్ చేయాలని సేవ్ లక్షద్వీప్ ఫోరం డిమాండ్ చేసింది.

ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల పాటు స్ధానికులు ఇళ్లలోనే ఉంటూ నిరాహారదీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చింది. దీంతో లక్షద్వీప్ సంస్కృతిని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్న అడ్మినిస్ట్రేటర్కు వ్యతిరేకంగా స్ధానికులు ప్లకార్డులతో నిరాహారదీక్షలకు దిగారు.
లక్షద్వీప్లో భాగంగా ఉన్న పలు దీవుల్లోని స్ధానికులు ఇళ్లవద్దే తొలిసారి ఇలా నిరాహారదీక్షలు చేపట్టడం విశేషం.

లక్షద్వీప్లోని దీవుల్లో జరుగుతున్న నిరాహారదీక్షల్లో ప్రజలు అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్తో పాటు కలెక్టర్ అస్కర్ అలీని కూడా రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరాహారదీక్షలు చేస్తున్న ప్రజలతో పాటు అన్నిరాజకీయ పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని సేవ్ లక్షద్వీప్ ఫోరం ప్రతినిధులు చెప్తున్నారు. అడ్మినిస్టేటర్ను రీకాల్ చేసే వరకూ తాము నిరసనలు విరమించుకోబోమని చెప్తున్నారు. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ తీసుకున్న నిర్ణయాలు అమల్లోకి వస్తే తమ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications