హాలీవుడ్ సినిమాను తలపించేలా..: లలితా జువెల్లరీలో రూ.50కోట్ల ఆభరణలు అపహరణ
తిరుచ్చి: హాలీవుడ్ సినిమా 'డార్క్ నైట్' తరహాలో తమిళనాడులోని తిరుచ్చిలో భారీ దొంగతనం జరిగింది. ఆ సినిమాలోలానే మాస్కులు ధరించిన దొంగలు నగరంలోని లలితా జువెల్లరీ దుకాణంలో రూ. 50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.
బుధవారం తెల్లవారుజామున దుకాణం గోడను తొలిచి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం ఉదయం దుకాణం తెరవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు సిబ్బంది. వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బంజారహిల్స్లో భారీ దొంగతనం.. 3కోట్ల విలువైన వజ్రాలు, నగదు మాయం
ఫ్యాన్సీ మాస్కులు ధరించి..
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. ఫ్యాన్సీ ఎనిమల్ మాస్కులు ధరించిన ఆ దొంగలు బుధవారం తెల్లవారుజామున 2 నుంచి 3గంటల మధ్యలో దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు.
దుకాణంలోని వ్యక్తులే సహకరించారా?
త్రిచీ సిటీ పోలీస్ కమిషనర్ అమల్రాజ్, సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరదరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫొరెన్సిక్ నిపుణులు ఆ దుకాణంలో నమూనాలను సేకరించారు. మాస్కులు ధరించి దొంగతనం చేయడం చర్చనీయాంశంగా మారింది. దుకాణంలోని వ్యక్తులే ఎవరైనా దొంగలకు సహకరించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హాలీవుడ్ సినిమా తరహాలో..
బాగా మందం ఉన్న గోడను పగలగొట్టి మరీ ఈ దొంగతనం చేయడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మాస్కులు ధరించి దొంగతనం చేయడంతో హాలీవుడ్ సినిమా డార్క్ నైట్ సినిమాను ఏమైనా మార్గదర్శకంగా తీసుకున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఇది రెండో భారీ దొంగతనం..
కాగా, త్రిచీ నగరంలో జరిగిన రెండో భారీ దొంగతనం ఇదే కావడం గమనార్హం.
ఈ ఏడాది జనవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. మూడు లాకర్లను తెరిచిన దొంగలు రూ. 19లక్షల నగదు, 470 సవరల బంగారం, పత్రాలను ఎత్తుకెళ్లారు.