అర్దరాత్రి అంత్యక్రియలు అందుకే .. బాబ్రీ మసీదు తీర్పుతో లింక్ పెట్టి ... సుప్రీంకు యూపీ ప్రభుత్వం
హత్రాస్ సామూహిక అత్యాచార ఘటనలో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతి మరణం తరువాత ఆమె మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించకుండా, తమ కుమార్తె విషయంలో వారి చివరి కోరిక కూడా తీర్చకుండా అర్ధరాత్రి పోలీసులు దహనం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దీనిపై సుప్రీం ధర్మాసనానికి యూపీ ప్రభుత్వం సమాధానం చెప్పింది.
హత్రాస్ ఘటనలో పోలీసులకు షాక్ ...అత్యాచారం జరిగిందని నిర్ధారించిన నివేదిక
మరుసటి రోజు బాబ్రీ మసీదు కేసు తీర్పు .. ఆ కారణంగా ..
హత్రాస్ ఘటనలో బాధితురాలికి అర్దరాత్రి 2.30 నిముషాలకు దహన సంస్కారాలు నిర్వహించడానికి గల కారణాలను సుప్రీం కోర్టుకు వివరించింది. మరుసటి రోజు బాబ్రీ మసీదు కు సంబంధించిన కేసు తీర్పు ఉన్న నేపథ్యంలో, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్న కారణంగా అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా తెలిపారు . ఇంటలిజెన్స్ నివేదిక ఆధారంగానే తాము ఆ విధంగా చేయాల్సి వచ్చిందని సుప్రీం ధర్మాసనానికి వివరించారు ప్రభుత్వం తరపు న్యాయవాది .
ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితి.. ఆ కారణంతోనే అర్దరాత్రి అంత్యక్రియలు
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా యూపీ ప్రభుత్వం అర్ధరాత్రి 2.30 నిమిషాలకు హత్రాస్ లో సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతి అంతిమ సంస్కారాలను నిర్వహించిందని పేర్కొంది . కుటుంబ సభ్యులెవరూ లేకుండానే అంత్యక్రియలు నిర్వహించిన యూపీ ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానానికి ఒక అఫిడవిట్ ను దాఖలు చేసింది. అంతేకాదు అత్యాచార బాధిత యువతి మరణం తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు .
బాధితురాలి మరణంతో కుట్ర కోణం .. నిఘావర్గాల వెల్లడి
సఫ్దర్ జంగ్ ఆస్పత్రి వద్ద ధర్నా చోటు చేసుకోవడంతో పాటు మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు నివేదికలు అందించాయని పేర్కొంది. బాధితురాలి మరణంతో కుల,మత ఘర్షణలకు పాల్పడి కొందరు దానిని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రయత్నం కూడా జరుగుతుందని సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. ఘర్షణలను నివారించటం, శాంతి భద్రతల పరిరక్షణ కోసమే అత్యవసరంగా బాధితురాలి అంతిమ సంస్కారాలు నిర్వహించవలసి వచ్చిందని యూపీ ప్రభుత్వం సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది.