2024, 2029లో జమిలి ఎన్నికలు ? లా కమిషన్ రిపోర్ట్ రెడీ ! నేడు ప్రకటన..?
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల చర్చ జరుగుతున్న వేళ 22వ లా కమిషన్ కూడా దీనికే మొగ్గు చూపుతోంది. దేశవ్యాప్తంగా ఒకే సారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే భారీ ఎత్తున ప్రజా ధనం, సమయం ఆదా అవుతాయని, పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్రానికి ఇవాళ నివేదిక సమర్పించేందుకు లా కమిషన్ సిద్దమవుతోంది. ఇవాళ ఢిల్లీలో భేటీ అయి జమిలి ఎన్నికలతో పాటు తమకు అప్పగించిన మరో రెండు అంశాలపైనా తుది నివేదిక ఖరారు చేయబోతోంది.
దేశంలో జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతున్న కేంద్రం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో 14 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఓసారి భేటీ అయి తదుపరి భేటీలో రాజకీయ పార్టీలు, లా కమిషన్ ను తమ అభిప్రాయాలు చెప్పేందుకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో లా కమిషన్ జమిలి ఎన్నికలపై ఇవ్వబోతున్న నివేదిక కీలకంగా మారింది. ఈ నివేదికలో లా కమిషన్ పలు కీలక సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా లా కమిషన్ 2024, 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సిఫార్సు చేయబోతోంది. వాస్తవానికి దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2024, 29లోనే జరగాల్సి ఉంది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్ని పూర్తి స్ధాయిలో జమిలి ఎన్నికలుగా మార్చి నిర్వహించాలని లా కమిషన్ సిఫార్సు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో షెడ్యూల్ ఎలా ఉండాలో కూడా సూచించబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ దీనికి తుది మెరుగులు దిద్ది ఫైనల్ చేసేందుకు లా కమిషన్ భేటీ కాబోతోంది. ఈ భేటీ తర్వాత కేంద్ర న్యాయశాఖకు ఈ రిపోర్టు పంపబోతోంది.
ఇవాళ ఛైర్మన్ రితూరాజ్ అవస్ధి నేతృత్వంలో జరిగే భేటీలో లా కమిషన్ జమిలి ఎన్నికలతో పాటు మరో రెండు అంశాలపైనా నివేదికలు ఖరారు చేయనుంది. ఇందులో పోస్కో చట్టం వర్తింప చేసేందుకు కనీస వయస్సు, అలాగే ఎఫ్ఐఆర్ లను తప్పనిసరిగా ఆన్ లైన్లో ఉంచే అంశంపై కేంద్రానికి సిఫార్సులు చేయబోతోంది. ఈ మూడు అంశాలపై నివేదికల్ని ఫైనల్ చేసేందుకు ఇవాళ కమిషన్ భేటీ అవుతోంది. ఇందులో ఉన్న జమిలి ఎన్నికల అంశం దృష్టా ఈ రిపోర్ట్ కీలకం కానుంది.
గతంలో తొలిసారి 2018లో జస్టిస్ బిఎస్ చౌహాన్ (రిటైర్డ్) నేతృత్వంలోని 21వ లా కమిషన్ ముసాయిదా నివేదికలో 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' ఆలోచనను కూడా సిఫార్సు చేసింది.ఇందులో జమిలి ఎన్నికల్లో ఉన్న సమస్యల సంక్లిష్టత దృష్ట్యా ప్రభుత్వానికి తుది సిఫార్సులు చేసే ముందు మరోసారి భాగస్వాములందరితోనూ చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే తుది సిఫార్సు చేయకముందే ఆ కమిషన్ పదవీకాలం ముగిసింది. దీంతో 2020 ఫిబ్రవరిలో మూడేళ్ల కాలానికి 22వ లా కమిషన్ ఏర్పాటైంది. అయితే దాని చైర్పర్సన్, కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు రాజ్ అవస్తీ నవంబర్ 2022లో నియమితులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కమిషన్ పదవీకాలం ముగియనుండడంతో దాన్ని ఆగస్టు 31, 2024 వరకు పొడిగించారు.












Click it and Unblock the Notifications