Bihar Election: వస్తే 10 లేకపోతే 150-బీహార్ ఫలితాలపై తేల్చేసిన పీకే..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. మరోసారి గెలిచి అధికార పీఠం ఎక్కాలని టార్గెట్ పెట్టుకున్న ఎన్డీయేకు విపక్ష ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. అదే సమయంలో తాజాగా పుట్టిన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సురాజ్ కూడా ఈ రెండు కూటములకూ పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల ఫలితాలు ఏ మలుపు తిరుగుతాయో ఎవరూ చెప్పలేని పరిస్ధితి నెలకొంది.
బీహార్ ఎన్నికల్లో తొలిసారి తన పార్టీ జన్ సురాజ్ ను బరిలోకి దింపుతున్న ప్రశాంత్ కిషోర్ తాను మాత్రం వ్యూహాత్మకంగా పోటీకి దూరంగా ఉన్నారు. అయినా బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓడిపోవడం ఖాయమంటూ ఇప్పటికే ఓ సంకేతం ఇచ్చేశారు. తాజాగా ఇవాళ మరో అంశంపై పీకే తనదైన శైలిలో జోస్యం చెప్పారు. తన పార్టీ జన్ సురాజ్ అయితే 10 సీట్ల కన్నా తక్కువే గెలుస్తుందని, లేకపోతే 150 సీట్లు దాటిపోతుందంటూ ఆజ్ తక్ ఇంటర్యూలో సంచలన అంచనాలను వెలువరించారు.

జన్ సురాజ్ పార్టీని ఓటర్లు నమ్మితే 150 సీట్లకు మించి గెలుస్తామని, నమ్మకపోతే మాత్రం 10 సీట్ల కన్నా తక్కువకే పరిమితం అవుతామంటూ ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. తన పార్టీకి 150 సీట్లు గెల్చుకోవాలని టార్గెట్ పెట్టిన ప్రశాంత్ కిషోర్.. అంతకన్నా తక్కువ వస్తే ఓడిపోయినట్లేనని చెప్పేస్తున్నారు. ఈ మేరకు నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. బీహార్ ఎన్నికల్లో 243 సీట్లలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు.

తాము 10 సీట్ల కన్నా తక్కువ గెల్చుకున్నా, 150 సీట్లకు మించి గెలిచినా ఈ చర్చ మాత్రం ఆగిపోదని పీకే స్పష్టం చేశారు.
ఎందుకంటే చాలా చర్చలు జరిగాయని,బీహార్ దుస్థితిని అంతం చేయడానికి ఇదే మార్గం అని ప్రజలు అర్థం చేసుకున్నారని పీకే తెలిపారు. ప్రజలు విశ్వాసంతో ముందుకొస్తే అన్ని సమీకరణాలు తప్పు అని నిరూపించబడతాయన్నారు.వారు అలా చేయకపోతే, ప్రతిదీ విని అర్థం చేసుకున్న తర్వాత కూడా తాము 10 కన్నా తక్కువ సీట్లే గెల్చుకునే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications