ఆకు రౌడీలు.. లాఠీలతో భయపెట్టలేరు -ఏసుక్రీస్తుకు యూదా, కేరళకు విజయన్ ద్రోహం -ప్రధాని మోదీ సంచలనం
కేరళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సాగుతోన్న దురాగతాలను ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అచ్చంగా ఆందోళన జీవిలా మాట్లాడారు. లెఫ్ట్ సర్కారు దమనకాండను నిరసిస్తూ.. 'ఆకురౌడీల్లారా.. మీ లాఠీలతో మమ్మల్ని భయపెట్టలేరు' అని గర్జించారు. ఏసుక్రీస్తుకు ఆయన శిశ్యుల్లో ఒకరైన యూదా తలపెట్టిన ద్రోహాన్ని, శబరిమలలో హిందువుల ఆత్మగౌరవాన్ని గుర్తుచేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాలక్కాడ్లో మోదీ సభ..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పాలక్కాడ్ జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. కేరళలో అధికార లెఫ్డ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్), ప్రతిపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్)లను కలిపి తిడుతూ, తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న గోల్డ్ స్మగ్లింగ్ ఉదంతాన్ని, శబరిమల ఆలయంపై కొద్ది రోజులుగా సాగుతోన్న వివాదాన్ని కూడా ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అదే సమయంలో కేరళ అభివృద్ధికి బీజేపీ రూపొందించిన రూట్ మ్యాప్ ను సైతం మోదీ వివరించారు.

ఆకు రౌడీల్లా ఆ నేతలు..
''కేరళలో ఏళ్ల తరబడి ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్, ఈ రెండు కూటములే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. వీళ్లిద్దరికీ కేరళ సంస్కృతి అన్నా, స్థానిక సంప్రదాయాలన్నా ఏ మాత్రం గౌరవం లేదు. కేరళ కల్చర్ ను అడుగడుగునా అవమానిం చే ఈ కూటముల నేతలు అచ్చంగా ఆకు రౌడీల్లాగా వ్యవహరిస్తారు. కేరళ గౌరవాన్ని కాపాడాలని చూస్తోన్న బీజేపీ నేతలపై దాడులు, హత్యలు, అకృత్యాలకు తెగబడుతున్నారు. రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలను సైతం జైళ్లలో పెడుతున్నారు. ఏది ఏమైనా మీ లాఠీలకు మేం భయపడబోమని తెలుసుకోండి, కేరళను కాపాడుకోడానికే బీజేపీ కంకణబద్ధురాలై ఉందని గుర్తుంచుకోండి. విచిత్రమేంటంటే, కేరళలో ప్రత్యర్థుల్లా కనిపించే లెఫ్ట్, కాంగ్రెస్ కూటములు బెంగాల్ లో మాత్రం పొత్తు పెట్టుకుంటారు. రెండు రాష్ట్రాల్లో వీళ్లూ మ్యాచ్ ఫిక్సింగ్ ఆడుతున్నారు. మరో ముఖ్యవిషయం..

ఏసుక్రీస్తుకు యూదా ద్రోహం చేసినట్లు..
భగవంతుడైన ఏసు క్రీస్తుకు ఆయన శిశ్యుల్లో ఒకడైన యూదా(ఇస్కరయోతు యూదా) ద్రోహం చేస్తాడు. పిరికెడు వెండి నాణేల కోసం నాడు యూదా తలపెట్టిన పనినే ఇవాళ కేరళలో ఎల్డీఎఫ్ చేస్తున్నది. వెండి నాణేల కోసం యూదా క్రీస్తును మోసం చేసినట్లు, గుప్పెడు బంగారు నాణేల కోసం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేరళకు ద్రోహం చేస్తున్నది. వీళ్ల ఆటలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ లను ఓడించడం ద్వారా కేరళలో సరికొత్త శకాన్ని ఆరంబించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం..

కేరళలో ‘ఫాస్ట్' ఫార్ములా..
బీజేపీ అధికారంలోకి వస్తే కేరళలో 'ఫాస్ట్' ఫార్ములాను అమలు చేస్తాం. కేరళలో సతర్వ (ఫాస్ట్) అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. ఫాస్ట్కు (ఎఫ్ఏఎస్టీ) అర్థం ఏమిటంటే.. 'ఎఫ్' అంటే మత్స్యసంపద, ఎరువులు (ఫిషరీప్, ఫెర్టిలైజర్స్), 'ఏ' అంటే వ్యవసాయం, ఆయుర్వేదం (అగ్రికల్చర్, ఆయుర్వేద), 'ఎస్' అంటే నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డవలప్మెంట్), సామాజిక న్యాయం (సోషల్ జస్టిస్), 'టీ' అంటే పర్యాటకం (టూరిజం), సాంకేతికత (టెక్నాలజీ). ఈ ఫార్ములాతో కేరళను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి బీజేపీ కట్టుబడి ఉంది'' అని ప్రధాని మోదీ అన్నారు. అదే సభలో..

మెట్రో శ్రీధరన్పై మోదీ ప్రశంసలు
పాలక్కాడ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను బీజేపీ అధికారికంగా ప్రకటించనప్పటికీ పరోక్షంగా ఆ సంకేతాలు ఇస్తోంది. ఇవాళ్టి సభలో మెట్రో శ్రీధరన్ పై మోదీ ప్రశంసలు కురిపించారు. భారతదేశానికి కొత్త రూపం ఇచ్చారని, మెరుగైన అనుసంధాన వ్యవస్థలను ఏర్పాటు చేశారని, సమాజంలోని అన్ని వర్గాల అభినందనలను శ్రీధరన్ అందుకున్నారని ప్రధాని అన్నారు. మెట్రో శ్రీధరన్ మాట్లాడుతూ, పాలక్కాడ్ నియోజకవర్గం కోసం తనవద్ద ఒక మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పారు. 24 గంటలు నీటి సరఫరా, సమర్ధవంతమైన సాలిడ్ వేస్ట్ మేనిజిమెంట్ స్కీమ్ ఇందులో భాగమని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల మొక్కలు నాటడం ద్వారా పచ్చదానానికి పెద్దపీట వేస్తామన్నారు. మొత్తం 140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న పోలింగ్ జరుగనుంది.












Click it and Unblock the Notifications