కరోనా లాక్డౌన్: వీధి కుక్కలపై ప్రభావం.. ఇప్పటికే వాటి ప్రవర్తనలో మార్పులు..
ఒక ఉపద్రవం ఎంత భయంకరంగా ఉంటుందనడానికి కరోనా మహమ్మారే నిదర్శనం. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 77వేల మందిని బలితీసుకున్న వైరస్.. ఇప్పుడు జంతువులపైనా పంజా విసురుతున్నది. న్యూయార్క్లోని బ్రోంక్స్ జూ పార్క్లో పనిచేసే ఉద్యోగి ద్వారా.. మలయన్ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. బెల్జియంలోనూ ఓ పిల్లికి దాని యజమాని నుంచి కరోనా వచ్చినట్లు తేలింది. కరోనా ధాటికి దేశాలన్నీ లాక్ డౌన్ అయిపోయిన పరిస్థితిలో ఆ ప్రభావం కుక్కలపై పడినట్లు నిపుణులు తెలిపారు.

బిహేవియరల్ ఛేంజ్
మన దేశంలో 134 కోట్ల జనాభాతోపాటు సుమారు 40 లక్షల వీధి కుక్కలు కూడా జీవిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించడంతో ఇప్పుడా కుక్కలన్నీ దిక్కుతోచని స్థితిలోకివెళ్లాయి. ఇప్పటికే కుక్కల ప్రవర్తనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం అవి గందరగోళంలో పడిపోయాయని ఢిల్లీకి చెందిన యానిమల్ బిహేవియరిస్ట్ ఆకాంక్ష యాదవ్ చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఈ బిహేవియరల్ ఛేంజ్ అన్ని కుక్కల్లో రాలేదని, నిర్దిష్ట కేటగిరిలోనివి మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయని ఆమె తెలిపారు.

కుక్కలు మాయమైపోతున్నాయ్..
ఇప్పటిదాకా ఏ రందీ లేకుండా జీవించిన కుక్కలు.. లాక్ డౌన్ తర్వాత ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయని, దొరికే ఏ కొంచెమో తిండి కోసం గుంపుల మధ్య కొట్లాటలు సాగుతున్నాయని యాదవ్ పేర్కొన్నారు. మనుషులపైనే ఆధారపడే వీధి కుక్కలు.. ఇప్పుడు మార్కెట్లు, హోటళ్లు, ఆఖరికి రోడ్ల పక్కన టిఫిన్ బండ్లు కూడా మూతపడటంతో కష్టకాలాన్ని అనుభవిస్తున్నాయని ఆమె చెప్పారు. ఢిల్లీలో ‘పావ్ట్రిక్స్' పేరుతో కుక్కల సంరక్షణ, శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారామె. ఇదే విషయంపై జంతు హక్కుల ప్రచారకర్త సంగీతా డోగ్రా మాట్లాడుతూ.. రోడ్లపై మనుషులు కనిపించకపోవడంతో కుక్కలు కన్ఫ్యూజన్ లో పడిపోయాయని, లాక్ డౌన్ తర్వాత తమ లొకాలిటీలోని వీధి కుక్కలన్నీ కనిపించకుండా పోయాయని వాపోయారు.

వేటాడినా తినలేవు..
‘‘చెత్తకుప్పల్లో ఏరుకుతినే వీధికుక్కలు నిజానికి స్కావెంజర్లలా పనిచేస్తాయి. వేల ఏళ్లుగా మనుషులతోనే కలిసి జీవిస్తున్నందున అవి వేట స్వభావాన్ని కోల్పోయాయి. జాతివైరం కొద్దీ కుక్కలు.. పిల్లుల్ని తరిమి చంపినప్పటికీ, ఆ మాంసాన్ని తినలేవు. లాక్ డౌన్ కారణంగా తిండి దొరకని పరిస్థితుల్లో కుక్కల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది''అని అద్నాన్ ఖాన్ వివరించారు. ఢిల్లీ చత్తర్ పూర్ ఏరియాలో ఆయన డాగ్ ట్రైనింగ్ స్కూల్ నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల కష్టాలతోపాటు కుక్కలకు కొంత మేలు కూడా జరగిందంటారాయన.

కొట్టేవాళ్లు లేక..
నిజానికి జనసంచారం తక్కువగా ఉండే గ్రామాల్లోని వీధి కుక్కలు.. సిటీల్లోని కుక్కల కంటే సంతోషంగా జీవిస్తాయని, కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించిన తర్వాత సిటీల్లోనూ జన సంచారం నిలిచిపోవడంతో అవి కూడా ఆనందంగా ఆనందిస్తుండొచ్చని అద్నాన్ ఖాన్ అన్నారు. ప్రస్తుతం రోడ్లపై వాహనాలు తిరగట్లేదు, వీధి కుక్కల్ని ఇష్టమొచ్చినట్లు కొట్టే మనుషులు కూడా తిరగట్లేదు, ఒకరకంగా కుక్కలకు ఇది పండుగ సమయం లాంటిదే కానీ ఆహారమే అన్నింటికన్నా ప్రధాన విషయం కాబట్టి అవి సంబురాలు చేసుకోలేవని ఖాన్ వివరించారు. ఇకపోతే,
Recommended Video

జంతువుల ద్వారా వైరస్ వ్యాప్తి?
అమెరికా జూ పార్క్ లో పులికి కరోనా వైరస్ సోకిన విషయం వెల్లడైన తర్వాత అన్ని దేశాలూ అప్రమత్తమయ్యాయి. కొవిడ్ రోగుల ద్వారా జంతువులకు కూడా వైరస్ వ్యాపిస్తుందని తెలియడంతో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కరోనా కాటుకు గురైన జంతువుల ద్వారా తిరిగి మనుషులకు వైరస్ సోకుతుందనడానికి స్పష్టమైన ఆధారాలేవీ లేవు.












Click it and Unblock the Notifications