బావ, మరదలుపై దుండగుల దాడి, వేధింపులు(వీడియో)
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని రాంనగర్ ప్రాంతంలో ఓ దేవాలయ సందర్శనకు వచ్చిన బావామరదళ్లపై కొందరు దుండగులు దాడికి దిగారు. కాసీపూర్కు చెందిన ఆ బావామరదళ్ల జంట రాంనగర్లోని గిరిజా మందిరానికి వెళ్లారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే చెరువు వద్దకు వెళ్లారు.
అదే సమయంలో మురాదాబాద్ నుంచి వచ్చిన ఆరుగురు యువకులు అక్కడ ఈత కొడుతున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ ఆకతాయిలు ఈ జంటను చూసి వేధించడం చేయడం మొదలుపెట్టారు.
యువతిని లైంగికంగా వేధించడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న యువకుడిని చితకొట్టారు. నీళ్లల్లోకి తోసేసి ముంచేయడానికి ప్రయత్నించారు. యువతిపైన ఆ దుర్మార్గులు చేయి చేసుకున్నారు. ఈ గొడవంతా కెమెరాల్లో రికార్డయ్యింది.
కాగా, ఆకతాయిల బారి నుంచి తప్పించుకున్న యువతి.. పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఆ యువతి బావ ఆచూకీ లభించలేదు. నిందితులు అతడ్ని నీళ్లలో తోసేశారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను విచారిస్తున్నారు.