కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసిన పార్లమెంటు: చట్టంగా మారిన పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చాలా కీలకమైన బిల్లులకు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల నిరసనలతో సాగిన ఉభయసభలు శుక్రవారం నాడు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో లోక్సభలో 116శాతం పనితీరు కనబర్చిందని, రాజ్యసభ 99శాతం పనిచేసిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు.

ఎగువ 14, దిగువసభ 15 బిల్లులకు ఆమోదం
షెడ్యూల్ ప్రకారం 108 గంటల 33 నిమిషాలు రాజ్యసభ సమావేశాలు జరగాల్సి ఉండగా.. 107 గంటల 11 నిమిషాలు పనిచేసింది. కాగా, శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో దిగువ సభలో 18 బిల్లులు ప్రవేశపెట్టగా.. ఇందులో 14 బిల్లులకు ఆమోదం లభించింది. రాజ్యసభలో 15 బిల్లులు ఆమోదం పొందాయి.

కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఉభయసభల్లోనూ ఆమోదం పొంది.. రాష్ట్రపతి సంతకంతో చట్టంగా కూడా మారింది. ఎస్పీజీ సవరణ బిల్లు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ బిల్లు, పన్ను చట్టాల సవరణ బిల్లు, ఈ-సిగరెట్ల నిషేధంపై బిల్లు, తదితర బిల్లులపై కూడా ఈ సమావేశాలు ఆమోద ముద్ర వేశాయి.

రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా..
పార్లమెంటు ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి గురువారం సాయంత్రం ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ రాజపత్రం(గెజిట్) విడుదల చేసింది. ఈ బిల్లుకు రాజ్యసభలో 120 ఓట్లు అనుకూలంగా .. 105 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఇక లోక్ సభలో 311 ఓట్లు అనుకూలంగా రాగా.. 80 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.












Click it and Unblock the Notifications