తెగబడ్డ రేపిస్ట్.. బాధితురాలి వేళ్లను నరికి..
భోపాల్ : రేప్ చేయడం.. ఆపై.. బాధితులతో రాజీ బేరాలు కుదుర్చుకోవడం.. మాట వినకుంటే, మట్టుపెట్టడానికైనా వెనుకాడకపోవడం.. దేశంలో చాలామంది రేపిస్టుల తీరు ఇలాగే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ రేపిస్టు, బాధితురాలి చేతి వేళ్లను నరికేయడం చర్చనీయాంశంగా మారింది.
న్యాయం చేయమని పోలీసుల వద్దకు వెళ్తే.. సదరు పోలీసులు కూడా నిందితుడికే వత్తాసు పలికేలా వ్యవహరించడంతో.. ఏం చేయాలో తోచని స్థితిలో స్థానిక ఎస్పీని ఆశ్రయించింది బాధితురాలు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ లోని తికమ్ ఘడ్ పరిధిలో.. జరాన్ ప్రాంతానికి చెందిన కున్వర్ లాల్ (45) 2014 అక్టోబరులో 27 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశాడు. రెండేళ్లు గడిచిపోయాక గానీ ఈ ఘటనకు సంబంధించిన కేసు కోర్టులో విచారణకు రాలేదు. విచారణ అనంతరం.. నిందితుడు కున్వర్ లాల్ కు గత నెలలో స్థానిక కోర్టు బెయిలు మంజూరు చేసింది.
జైలుకు వెళ్లొచ్చినా.. కున్వర్ లాల్ లో పశ్చాత్తాపం లేదు సరికదా.. బాధితురాలిపై మళ్లీ దాడికి తెగబడ్డాడు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా ఆమెపై బెదిరింపులకు దిగిన కున్వర్ లాల్, బాధితురాలి రెండు చేతి వేళ్లను నరికేశాడు. దీనిపై పోలీసులను ఆశ్రయిస్తే.. చర్యలు తీసుకోవడం సంగతి పక్కనబెడితే నిందితుడినే వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు స్థానిక పోలీసులు.
ఈ క్రమంలోనే స్థానిక ఎస్పీ నిమిష్ అగర్వాల్ ను సంప్రదించి తన గోడు వెల్లబోసుకుంది బాధితురాలు. ఎస్పీ ఆదేశాలతో నిందితుడు కున్వర్ లాల్ ను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలు డిమాండ్ చేస్తోంది.