పన్నీరుసెల్వంకు ఊరట, జయలలిత ఫొటోలు ఉండొచ్చు: డీఎంకే పిటిషన్ తిరస్కరణ
చెన్నై: తమిళనాడు శాసనసభలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని తొలగించాలన్న ప్రతిపక్ష డీఎంకే అభ్యర్ధనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. శాసనసభాపతి నిర్ణయంపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 12న తమిళనాడు శాసనసభలో మహాత్మగాంధీ సహా మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కామరాజ్, ఎంజీఆర్ చిత్రపటాల పక్కనే జయలలిత చిత్రపటాన్ని స్పీకర్ ధనపాల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న ప్రతిపక్ష డీఎంకే అదేరోజు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో శిక్షపడిన జయ చిత్రపటాన్ని శాసనసభలో ఏర్పాటు చేయడం తగదని వాదించింది. అయితే, డీఎంకే వాదనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది.

పన్నీరుసెల్వంకు భారీ ఊరట
తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మరో 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. డీఎంకే విప్ సక్రపాణి దాఖలు చేసిన ఈ పిటిషన్ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అబ్దుల్ ఖుదోజ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.
2017, ఫిబ్రవరిలో పళనిస్వామి ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఈ 11 మంది విప్ను ధిక్కరించి అనుకూలంగా ఓటు వేశారంటూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు.
ఓటింగ్లో 122-11 తేడాతో అప్పట్లో అవిశ్వాసం వీగిపోయింది. అయితే, విప్ 122 మందికి మాత్రమే జారీ చేశారని, తమ వర్గానికి అది వర్తించదని పన్నీర్ పేర్కొన్నారు. అవిశ్వాసం తర్వాత జరిగిన పరిణామాల్లో పన్నీర్, పళని వర్గాలు ఏకమయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications