ఇంక్విలాబ్ జిందాబాద్.. అట్టుడికిన మద్రాస్ యూనివర్శిటీ
చెన్నై: పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన సెగలు మద్రాస్ యూనివర్శిటీని తాకాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు యూనివర్శిటీ క్యాంపస్లో నిరసనలకు దిగారు. దీంతో పోలీసులు క్యాంపస్లోకి ప్రవేశించారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ విద్యార్థులు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మింకు కూర్చున్నారు. రాత్రంతా ఇక్కడే ఉండి తమ నిరసనలు తెలుపుతామని విద్యార్థులు చెప్పారు. విద్యార్థుల రక్షణ కోసమే తాము కాపలాగా ఉన్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ... ఇద్దరు విద్యార్థులను పోలీసులు తీసుకెళ్లారని నిరసనకారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే విద్యార్థులను ఇద్దరినీ తాము స్టేషన్కు తీసుకుపోయిన మాట వాస్తవమేనని వారిని విచారణ చేసేందుకే స్టేషన్కు తీసుకెళ్లామని చెబుతున్నారు పోలీసులు. మద్రాస్ యూనివర్శిటీ అనుబంధ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులంతా వచ్చి నిరసనలు చేపట్టాలని వీరు ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. యూనివర్శిటీలోని మెరీనా క్యాంపస్లో నిరసనలు తెలపాలని విద్యార్థులను పురమాయిస్తున్నందునే ఈ ఇద్దిరి స్టూడెంట్స్ను విచారణ చేసేందుకు తీసుకొచ్చామని పోలీసులు తెలిపారు.
నిరసనల్లో మొత్తం 50 మంది విద్యార్థులు పాల్గొనడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జనవరి 2వరకు యూనివర్శిటీకి సెలవులను ప్రకటించారు. ఎలాగూ క్రిస్మస్ ఉన్నందున డిసెంబర్ 23 నుంచి సెలవులు ప్రకటించారని అయితే దాన్ని జనవరి 2వరకు పొడిగించారని విద్యార్థులు చెప్పారు. ఇలా సెలవులు పొడగించి తమ నిరసనలను అణిచివేయాలని చూస్తున్నారని కోఆర్డినేటర్గా ఉన్న రఘు ప్రసాద్ అనే విద్యార్థి మండిపడ్డాడు.
మరోవైపు విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించాలన్న ఉద్దేశం తమకు లేదని పోలీసులు చెబుతున్నారు. కాలేజీ అధికారులు ఫిర్యాదు చేయడంతోనే క్యాంపస్లోకి అడుగుపెట్టినట్లు వారు వెల్లడించారు. విచారణకు పిలిచినంత మాత్రాన వారిని అరెస్టు చేసినట్లు కాదని పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మెరీనా బీచ్కు ఎదురుగా ఉన్న గేటు వద్ద కూర్చుని విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో క్యాంపస్ హోరెత్తింది. ఇక విద్యార్థులు శాంతియుతంగా నిరసనలు చేపడుతుండటంతో పోలీసులు కూడా క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు.