మహారాష్ట్రలో మహమ్మారి: ఇక నుంచి రాత్రిపూట కర్ఫ్యూ, అత్యవసరాలకే అనుమతి
ముంబై: మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం మొత్తం రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది.

వచ్చే శుక్రవారం నుంచి రాత్రి కర్ఫ్యూ
కరోనా మహమ్మారి ఉధృతిపై మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. తాజా ఆంక్షలు సోమవారం నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. వచ్చే శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పూర్తి లాక్డౌన్ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది.

రాత్రి 8 నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాలు, నగరాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రం మొత్తం రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమలులో ఉండటంతోపాటు పగలు సమయంలోనూ ఐదుగురు కంటే ఎక్కువ మంది సమూహాలుగా ఏర్పడే అవకాశం లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు కూడా కేవలం 50 శాతం సిబ్బందితోనే పనిచేస్తాయని మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.

కర్ఫ్యూ అమలు సమయంలో అన్నీ బంద్..
ప్రైవేటు ఉద్యోగులు మాత్రం ఇంటి నుంచే పనిచేయాలని ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం తెలిపింది. బస్సులు, రైళ్లు కూడా 50 శాతం సామర్థ్యంతోనే నడపనున్నట్లు ప్రకటించింది. అంతేగాక, కర్ఫ్యూ అమలు సమయంలో హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేయనున్నారు. ఈ ఆంక్షలు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని సర్కారు తెలిపింది. పగటిపూట హోండెలివరీ సర్వీసులను అనుమతించనున్నారు.

వారాంతాల్లో అత్యవసరాలకు మాత్రమే అనుమతి..
వారాంతంలో మాత్రం అత్యవసర సేవలకు తప్ప మిగితా అన్ని బంద్ పాటించాలని సర్కారు స్పష్టం చేసింది. కరోనా కేసులు ఉధృతమవడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుంటే రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications