Maharashtra Assembly Polls: థాక్రే సమక్షంలో శివసేనలో చేరిన సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షెరా
ముంబై: మరో మూడు రోజుల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్కు సుదీర్ఘ కాలంపాటు బాడీగార్డుగా పనిచేసిన గుర్మీత్ సింగ్ అలియాస్ షెరా శుక్రవారం శివసేన పార్టీలో చేరారు. ఈ మేరకు శివసేన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే , యువసేన అధ్యక్షుడు ఆదిత్య థాక్రే సమక్షంలోనే వారి నివాసమైన మాతోశ్రీ రెసిడెన్సీలో శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు షెరా. కాగా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 21న జగరనున్నాయి. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి శివసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీతో కలిసి శరద్ పవర్ నేతృత్వంలోని ఎన్సీపీ పోటీ చేస్తోంది. ఇరు కూటముల నుంచి నేతలు మహారాష్ట్రాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. కాగా, గత ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగా పోటీ చేయడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాల్లో పోటీ చేసిన శివసేన కేవలం 63 స్థానాల్లోనే విజయం సాధించడం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రీపోల్ సర్వేలు వెలువడ్డాయి. ఇక మళ్లీ ముఖ్యమంత్రులుగా ఫడ్నవీస్, మనోహర్లాల్ ఖట్టర్లే ఉంటారని ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఐయాన్స్ - సీఓటర్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 16 మధ్య ఈ సర్వేను నిర్వహించారు.
90 స్థానాలు ఉన్న హర్యానాలో 59.8శాతం మంది ప్రజలు తిరిగి బీజేపీనే అధికారంలోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.15.8శాతం మంది మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించారు. ఇక అధికారంలోకి ఏ పార్టీ వస్తుందో చెప్పలేమని 14.2శాతం మంది తమ అభిప్రాయంను వ్యక్తం చేశారు. ఇక మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సరైన వ్యక్తి అంటూ 40.3శాతం మంది చెప్పారు.19.9శాతం మంది కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హూడాకు ఓటువేశారు.
288 స్థానాలున్న మహారాష్ట్రలో 48.8 శాతం మంది బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పగా. 10.6శాతం మంది మాత్రం కాంగ్రెస్ వస్తుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎన్సీపీ అధికారంలోకి వస్తుందని 11.3శాతం, బీజేపీ మిత్రపక్షం శివసేన అధికారంలోకి వస్తుందని 9శాతం మంది చెప్పారు. ఇక ముఖ్యమంత్రిగా మెజార్టీ అంటే 34.7 శాతం మంది ఫడ్నవీస్కు ఓటువేశారు. ఉద్ధవ్ థాక్రేకు 5.1శాతం మంది ఓటువేశారు. ఇక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అయితే బాగుంటుందని 5.9శాతం మంది ఓటువేశారు.