రెండోస్సారి: రేపే మంత్రివర్గ విస్తరణ: అజిత్ పవార్ నక్కతోక తొక్కినట్టేనా?
ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖాయమైంది. సోమవారం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచనప్రాయంగా వెల్లడించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నాయకుడు అజిత్ పవార్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోం మంత్రిత్వ శాఖను కూడా అజిత్ పవార్ కే కట్టబెట్టొచ్చని సమాచారం.

జంబో కేబినెట్ గా..
మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాడి సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉద్ధవ్ థాకరే సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆరుమందితోనే మహారాష్ట్ర మంత్రివర్గం కొనసాగుతోంది. తాజా విస్తరణ సందర్భంగా 16 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ముందుగా కుదుర్చుకున్న కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) ప్రకారం.. ఎన్సీపీ నుంచి 14, కాంగ్రెస్ నుంచి 12 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం ఒక్కో పార్టీ నుంచి ఇద్దరే..
ప్రస్తుతం ఎన్సీపీ నుంచి ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ధనంజయ్ ముండే, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్ బల్ మహారాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. వారికి అదనంగా అదే పార్టీకి చెందిన నవాబ్ మాలిక్, జితేంద్ర అవ్హద్, ఆదితి సునీల్ తత్కరే, అనిత్ దేశ్ ముఖ్, దిలీప్ వల్సే-పాటిల్ లను మంత్రివర్గంలో తీసుకోవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థొర్రట్, నితిన్ రౌత్ లు మంత్రివర్గంలో ఉన్నారు.

కాంగ్రెస్ లో జూనియర్లకూ ఛాన్స్?
కాంగ్రెస్ నుంచి ఎవరెవర్ని కొత్తగా కేబినెట్ లోకి తీసుకోబోతున్నారనే విషయం ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది. కొందరు సీనియర్లతో పాటు తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ఒకరిద్దరికి మంత్రివర్గంలో చేర్చుకునే అంశాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు బాలాసాహెబ్ థొర్రట్ సూచించిన వారికే కేబినెట్ పదవులు దక్కుతాయని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ జాబితాను ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి పంపించారని చెబుతున్నారు.

అజిత్ పవార్ కీలక పాత్ర..
మహారాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాలుగు రోజుల్లోనే కుప్పకూలిపోవడానికి, ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి పరోక్ష కారకుడు అజిత్ పవార్. ఇందులో సందేహాలు అనవసరం. దేవేంద్ర ఫడ్నవిస్ తో పాటే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్.. నాలుగు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సర్కార్ కదిలిపోయింది.. కుప్పకూలింది.

డిప్యూటీ సీటు ఆయనకే..
దీనితో- మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు బాటలు పడ్డాయి. అనంతరం అజిత్ పవార్.. మళ్లీ సొంతగూటికే చేరుకున్నారు. పార్టీలోకి తిరిగి రావడంతో ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఆయనకే కేటాయిస్తారంటూ మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ.. అవన్నీ వాస్తవ రూపం దాల్చలేదు. తొలిదశలో అజిత్ పవార్ కు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మలి దశలో విస్తరణ సందర్భంగా ఆయనకు తప్పనిసరిగా కేబినెట్ లోకి తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications