మహారాష్ట్ర సంక్షోభం: నడ్డాతో అమిత్ షా భేటీ; ఢిల్లీకి ఫడ్నవీస్; పావులు కదుపుతున్న బీజేపీ!!
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం చోటు చేసుకుంది. మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతుందన్న టాక్ వినిపిస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో మొదలైన కలకలం నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మరింత ముదరడంతో ఒక మంత్రి సహా పదుల సంఖ్యలో శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లి పోవడం మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామాకు కారణంగా మారింది. ఇదే అదునుగా బీజేపీ పావులు కదుపుతుంది.
తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి మంత్రి ఏకనాథ్ షిండే
సీఎం ఉద్ధవ్ ఠాక్రే కు నమ్మినబంటుగా ఉన్న మంత్రి ఏకనాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు . ప్రస్తుతం ఆయన తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్ లో ఉన్నట్టు సమాచారం. వారు మాత్రమే కాకుండా మరికొంత మంది ఎమ్మెల్యేలు మొత్తం 35 మంది గుజరాత్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో మహారాష్ట్రలో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.
నడ్డా ఇంటికి అమిత్ షా ... ఢిల్లీకి దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్రలో సంక్షోభం సమయంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ను కలవడానికి హుటాహుటిన ఆయన ఇంటికి వెళ్లారు. ఈ పరిణామం రాజకీయవర్గాలలో ఆసక్తికరంగా మారింది. మరోవైపు మహారాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో నడ్డాతో అమిత్ షా భేటీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సంక్షోభంపై కూటమి పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. అయితే రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలవాలని నిర్ణయించుకున్నారు.
గుజరాత్ లోని సూరత్ రిసార్ట్స్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేలు
సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు 26 మంది శివసేన ఎమ్మెల్యేలు గుజరాత్లోని సూరత్ రిసార్ట్లో ఉన్నారు. మొత్తం 35 మంది షిండేకు మద్దతుగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామంపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ మరియు రాజ్యసభ ఎన్నికలలో రెండు వరుస పరాజయాలను చవిచూసిన తరువాత, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం దాని మంత్రి మరియు సీనియర్ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే సేన ఎమ్మెల్యేలతో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఊహించని ప్రమాదంలో పడింది. వారంతా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది.
శివసేన నుండి పెరుగుతున్న తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య.. పావులు కదుపుతున్న బీజేపీ
ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్రమైన రాజకీయ చర్చలకు దారితీసినప్పటికీ, సంజయ్ రౌత్ కూటమి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని శివసేన మరియు కాంగ్రెస్లు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదం లేదని తోసిపుచ్చారు. అయితే శివసేన నుండి మరింత మంది 'తిరుగుబాటు' ఎమ్మెల్యేలు నేడు షిండేతో చేరే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత వాతావరణం బిజెపికి అనుకూలంగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఈ సమయంలో బిజెపి అగ్రనేతలు కదుపుతున్న పావులు ఆసక్తికరంగా మారాయి.