ఎంపీ నవనీత్ కౌర్కు షాక్-ఆమె 'కులం'పై వివాదం-అవి తప్పుడు పత్రాలు-కోర్టు రూ.2 లక్షలు జరిమానా
మహారాష్ట్ర ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ కౌర్ రానాకి బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని తేల్చింది. అప్పటి కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేసింది. తప్పుడు పత్రాలను సమర్పించినందుకు ఆమెకు రూ.2 లక్షలు జరిమానా విధించింది. సరైన కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించేందుకు కోర్టు ఆమెకు కొన్ని నెలల గడువు ఇచ్చింది. ఒకవేళ నవనీత్ కౌర్ సరైన పత్రాలు సమర్పించని పక్షంలో ఆమె తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
Recommended Video
నవనీత్ కౌర్ రియాక్షన్ ఇదే...
శివసేన మాజీ ఎంపీ ఆనంద్ రావ్ అడ్సల్ పిటిషన్ మేరకు బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ ఎంపీ నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణ పత్రాలపై విచారణ చేపట్టింది. కోర్టు తీర్పుపై నవనీత్ కౌర్ మాట్లాడుతూ... న్యాయస్థానం ఆదేశాలను తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. అదే సమయంలో బాంబే హైకోర్టు తీర్పును తాను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తానని చెప్పారు. అక్కడ తనకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నవనీత్ కులంపై గతంలోనూ వివాదం
నవనీత్ 'కులం'పై వివాదం చెలరేగడం ఇదే తొలిసారి కాదు. 2016 లోనూ రాజు మంకర్ అనే వ్యక్తి నవనీత్ కుల ధ్రువీకరణ పత్రాలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నవనీత్ పంజాబ్కి చెందిన వ్యక్తి అని.. ఆమె ఎస్సీ కాదని... లబానా సామాజికవర్గానికి చెందినవారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ కులం మహారాష్ట్రలో ఎస్సీ జాబితా కిందకు రాదని పేర్కొన్నాడు.
ప్రస్తుతం నవనీత్ కౌర్ మహారాష్ట్రలోని అమరావతి(ఎస్సీ) లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అప్పటి శివసేన ఎంపీ ఆనంద్ రావ్ అడ్సుల్పై నవనీత్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. విదర్భలో నాగపూర్ తర్వాత అమరావతి రెండో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా ఉన్నది.
షాక్: లోక్సభ లాబీలోనే బెదిరించాడు -ఎంపీ నవనీత్ కౌర్ సంచలనం -చిక్కుల్లో సేన ఎంపీ సావంత్ -మహా డ్రామా
శివసేన వర్సెస్ నవనీత్
35 ఏళ్ల నవనీత్ కౌర్ దాదాపు ఏడు భాషలు మాట్లాడగలరు. ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది మహిళల్లో ఆమె ఒకరు. అమరావతి ఎంపీగా ఆమె ఎన్నికైన నాటి నుంచి శివసేనకు ఆమెకు మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు కలకలం కేసులో శివసేన ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ మహారాష్ట్ర హోంమంత్రిపై చేసిన అవినీతి ఆరోపణలను ఆమె లోక్సభలో ప్రస్తావించారు. సీఎం ఉద్దవ్ థాక్రే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటినుంచి శివసేన నేతలు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.అంతేకాదు,శివసేన ఎంపీ సావంత్ లోక్సభ లాబీలోనే తనను బెదిరించారని అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు.