తిరుపతి లడ్డూ వివాదం వేళ సీఎం సంచలనం... 'రాజ్యమాత-గోమాత'గా ఆవు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధమైవున్నాయి. ఒక పార్టీ ఎత్తుకు మరో పార్టీ పై ఎత్తులు వేస్తోంది. వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇటువంటి తరుణంలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఎన్నికల కోణంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. దేశీ ఆవులను 'రాజ్యమాత-గోమాత'గా ప్రకటించారు. దీనికి సంబంధించి వ్యవసాయ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆవులో ముక్కోటి దేవతలు
వేద కాలం నుండి దేశీ ఆవులకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని, ఆవును వేదాలు, పురాణాలు వర్ణించిన విధానాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆవులో ముక్కోటి దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గోమాతను హిందువులు పూజిస్తారు. అంతేకాకుండా ఆవుపాలలో ఎన్నో పోషకాలున్నాయి. ఆయుర్వేదం, పంచగవ్య చికిత్సలతోపాటు సేంద్రీయ వ్యవసాయంలో గోమాత ఎరువును ఉపయోగిస్తారు. ఇటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.

గోవుకు ఉన్న ప్రాధాన్యత తెలియజేస్తోంది
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మన సమాజంలో గోవుకు ఉన్న ప్రాధాన్యత, ఆధ్యాత్మికత, శాస్త్రీయ, చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుందని వ్యవసాయశాఖకు చెందిన అధికారి వ్యాఖ్యానించారు. ఆవు పేడతో వ్యవసాయానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని, దీన్ని ఉపయోగించి సాగుచేయడంవల్ల భూసారం పెరుగుతుందన్నారు. ప్రభుత్వం కూడా సేంద్రీయ ఎరువులతో వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తోందని ఆ అధికారి చెప్పారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మహారాష్ట్రకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించనుంది. వాస్తవానికి జమ్ముకాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటు మహారాష్ట్రకు కూడా జరపాల్సి ఉన్నప్పటికీ నవంబరులో జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications