మహా సంక్షోభం: షిండే క్యాంపులోని 9 మంది మంత్రులకు షాక్, వారి పోర్ట్ఫోలియాలు ఇతరులకు
ముంబై: మహారాష్ట్రలో సంక్షోభం మరింతగా ముదురుతోంది. తొమ్మిది మంది రెబల్ మంత్రులకు సంబంధించిన పోర్ట్ ఫోలియాలను మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే.. ఇతర మంత్రులకు అప్పగించారు. రెబల్ మంత్రులు, ఎమ్మెల్యేలు అస్సాం రాజధాని గౌహతిలోని ఓ లగ్జరీ హోటల్లో ఉన్న విషయం తెలిసిందే. రెబల్ మంత్రులు రాష్ట్రంలో లేకపోవడంతో ఆయా శాఖలను నిర్వహించేందుకు ఉద్ధవ్ థాక్రే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే క్యాంపులోనే ఎమ్మెల్యేలతోపాటు ఈ 9 మంది మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం ఉద్ధవ్ వారి శాఖలను ఇతర మంత్రులకు అప్పగించారు. ప్రస్తుతం సీఎం ఉద్ధవ్ థాక్రేతోపాటు నలుగురు కేబినెట్ మంత్రులు ఆదిత్య థాక్రే, అనిల్ పరబ్, సుభాష్ దేశాయి మాత్రమే మహారాష్ట్రలో ఉన్నారు.
ఆదిత్య థాక్రే పర్యావరణ, పర్యాటక, ప్రొటోకాల్ మంత్రిగా ఉన్నారు. ఈయన మినహా మిగిలిన ముగ్గురు మంత్రులు ఎమ్మెల్సీలే. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో శివసేనకు ఇంతకుముందు 10 మంది కేబినెట్ ర్యాంక్ మంత్రులు ఉండేవారు.
మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి సభలో మెజార్టీ లేదని, 55 ఎమ్మెల్యేల్లో 38 మంది తమ వద్దే ఉన్నారని సుప్రీంకోర్టులో షిండే వర్గం పిటిషన్ దాఖలు చేసింది. తామంతా మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు. తమపై విధించిన అనర్హత వేటు చెల్లదని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు తెలిపారు. అనర్హత నోటీసులకు వ్యతిరేకంగా షిండే వర్గం సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తోంది.
16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. జూన్ 27 సాయంత్రంలోగా తమ అనర్హత వేటుకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని మహారాష్ట్ర లేజిస్లేచర్ సెక్రటేరియట్ పేర్కొంది.