మహారాష్ట్రలో కరోనా కొత్త రికార్డు: ఒక్కరోజులోనే 31,855 కొత్త కరోనా కేసులు, ముంబైలో అత్యధికం
ముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా కేసుల్లో రికార్డులు సృష్టిస్తున్న మహారాష్ట్ర.. బుధవారం మరో రికార్డును బ్రేక్ చేసింది. బుధవారం ఒక్క రోజే 31,855 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 95 మరణాలు సంభవించాయి. 15,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,87,25,037 నమూనాలను పరీక్షించగా.. 25,64,881 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 22,62,593 మంది కోలుకున్నారు. 53,684 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,47,299 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, ఒక్క ముంబై మహా నగరంలోనే 5185 కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.
దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులున్న టాప్ 10 జిల్లాల్లో మహారాష్ట్రలోనే తొమ్మి ఉండటం ఇక్కడి కరోనావైరస్ ఉధృతికి నిదర్శనంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా, నాసిక్లో మార్చి 31 వరకు లాక్డౌన్ విధించారు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని షాపులు శని, ఆదివారాల్లో మూసివేయాలని అధికారులు ఆదేశించారు. మిగితా రోజుల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచేందుకు అవకాశం కల్పించారు.
ఔరంగాబాద్లో ఏప్రిల్ 11 వరకు లాక్ డౌన్ విధించగా, తాజాగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నాందేడ్ లోనూ మార్చి 25 నుంచి ఏప్రిల్ 5 వరకు లాక్డౌన్ ప్రకటించారు. నాగ్పూర్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.