మహారాష్ట్రలో బెంబేలెత్తిస్తున్న కరోనా కేసులు: ఒక్కరోజే 60వేల కొత్త కేసులు, ముంబైలో అత్యధికం
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా అరలక్ష కరోనా కేసులు నమోదవుతుండటంతో మహారాష్ట్ర ప్రజలతోపాటు సర్కారు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు తీవ్రత తగ్గకపోవడం గమనార్హం.
మహారాష్ట్రలో ఒక్కరోజే 60వేల కొత్త కేసులు
తాజాగా, బుధవారం ఒక్కరోజే సుమారు 60వేల కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి ఈస్థాయిలో భారీగా కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మహారాష్ట్రలోనూ కొత్త కరోనా కేసులు కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.
మహారాష్ట్రలో 5లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
మహారాష్ట్రలో గత 24 గంటల వ్యవధిలో 59,907 కొత్త కేసులు నమోదు కాగా, 322 మంది మరణించారు. కొత్తగా మరో 30,296 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,11,48,736 నమూనాలను పరీక్షించగా.. 31,73,261 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 26,13,627 మంది కోలుకోగా, 56,652 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 5,01,559 యాక్టివ్ కేసులున్నాయి.
ముంబైలో 10వేలకుపైగా కొత్త కేసులు
ఇక ముంబైలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముంబైలో కొత్తగా 10వేలకు(10,428)పైగా కరోనా కేసులు నమోదు కాగా, 6007 మంది కోలుకున్నారు. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,82,760కి పెరిగింది. వీరిలో 3,88,011 మంది కోలుకోగా, 11,851 మంది మృతి చెందారు. ప్రస్తుతం ముంబైలో 81,886 యాక్టివ్ కేసులున్నాయి.
Recommended Video
నాగ్పూర్లో 5వేలకుపైగా కొత్త కేసులు
ఇక నాగ్పూర్లో కొత్తగా 5338 కొత్త కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో పలు నగరాల్లో కర్ఫ్యూ విధిస్తుండగా, వారాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్న విషయం తెలిసిందే. ప్రజలంతా కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ప్రజలను పదే పదే కోరుతోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా.. ఇలా కరోనా కేసులు భారీగా పెరిగితే మరోసారి లాక్డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇప్పటికే ప్రకటించారు.