మాకు సంఖ్యా బలం ఉంది..నేను ఎవరివైపు ఉంటానో లైవ్ టెలికాస్ట్లో చూడండి: అజిత్ పవార్
ముంబై: ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర వికాస్ అగాడీ ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బలపరీక్ష ఎదుర్కోనుంది. బలపరీక్షలో ఉద్ధవ్ థాక్రే సులభంగా నెగ్గుతారనే ఆత్మవిశ్వాసంను మహావికాస్ అగాడీ చెబుతోంది. సంకీర్ణ ప్రభుత్వానికి 165 నుంచి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఎన్సీపీ కాంగ్రెస్లు స్పీకర్ పోస్టుపై ఏకాభిప్రాయంకు వచ్చినట్లు తెలుస్తోంది.
స్పీకర్గా కాంగ్రెస్ నేత నానాపటోల్ పేరును ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు ప్రతిపాదించనున్నాయి. స్పీకర్ ఎన్నిక ఆదివారం జరగనుంది.నాగ్పూర్లోని సకోలీ నియోజకవర్గం నుంచి పటోల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు బీజేపీ కిసాన్ కథోర్ను స్పీకర్ రేసుకు ప్రతిపాదించింది. ఆయన థానే జిల్లాలోని ముర్బాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదిలా ఉంటే సంకీర్ణ ప్రభుత్వానికి 165 ఓట్లు వస్తాయని మంత్రి చగన్ భుజ్భల్ చెప్పారు.
మరోవైపు సభలో జరిగే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని తాము నిర్ణయించుకున్నట్లు అజిత్ పవార్ చెప్పారు. తను ఎవరికి మద్దతు ఇస్తానో, ఎవరి వైపు నిలుస్తానో ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరికీ తెలుస్తుందన్నారు పవార్. బలపరీక్ష సందర్భంగా పారదర్శకత కోసం ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు మొత్తం తంతును హెడ్ కౌంట్ ద్వారా నిర్వహిస్తామని అజిత్ పవార్ చెప్పారు. ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నారనేది ప్రజలు తెలుసుకునేందుకే ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అవసరమైన సంఖ్యాబలం కంటే ఎక్కువగానే తమకు ఉందని దాదాపు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని అజిత్ పవార్ చెప్పారు.
ఇదిలా ఉండగా ఎన్సీపీతరపున శాసనసభాపక్షనేతగా ఉన్న జయంత్ పాటిల్ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మధ్యాహ్నం సభ్యులందరికీ విప్ను జారీ చేస్తారు.