గోవా సీఎం అవ్వటానికి రాలేదు; ఢిల్లీ నుండి కేంద్రం దాదాగిరి ఆపటానికే వచ్చా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజుల గోవా పర్యటనలో భాగంగా రాజధాని పనాజీ పరిధిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ చేపలు మరియు ఫుట్బాల్ బెంగాల్ మరియు గోవాలను కలిపే రెండు అంశాలు అని పేర్కొన్నారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, రాష్ట్రంలో తాను సీఎం అవడానికి రాలేదని కేంద్రం కబంధ హస్తాల నుండి గోవాను రక్షిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రం యొక్క దాదాగిరిని తాను అనుమతించబోనని తేల్చి చెప్పారు.

ఢిల్లీ నుండి దాదాగిరీ ఇక చెల్లదు .. సీఎం కావటానికి రాలేదు
ఢిల్లీ నుండి కేంద్రం దాదాగిరి ఇక చెల్లదు అంటూ వ్యాఖ్యానించిన ఆమె ఇకపై ఢిల్లీ నుండి బెదిరింపులు ఉండవు అని పేర్కొన్నారు . తాను బయటి వ్యక్తిని కాదని పేర్కొన్నారు మమతాబెనర్జీ .ఇదే సమయంలో తాను, గోవాకు సీఎం కావాలనుకోలేదు అని మమతా బెనర్జీ కొంకణిలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. పనాజీలో తన మొదటి ప్రసంగంలో మమతా బెనర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను భారతీయురాలినని, తాను ఎక్కడికైనా వెళ్లగలనని పేర్కొన్న మమతా బెనర్జీ బెంగాల్ నా మాతృభూమి, గోవా కూడా నా మాతృభూమి అంటూ వ్యాఖ్యానించారు.

తనకు నల్లజెండాలు చూపిస్తే నమస్తే చెప్పి వచ్చా
తాను గోవాకు వస్తాను, బిజెపి నాయకులు తన పోస్టర్లను ధ్వంసం చేస్తారు, బిజెపి నాయకులు మానసిక కాలుష్యం కలిగి ఉన్నారని వ్యాఖ్యానించారు. గోవా వస్తున్న క్రమంలో వారు తనకు నల్ల జెండాలు చూపించారని పేర్కొన్న మమతా బెనర్జీ తాను నమస్తే చెప్పానని తెలిపారు. మమతా బెనర్జీ పర్యటనకు ముందు గోవాలో మమతా బెనర్జీ చిత్రాలతో కూడిన అనేక హోర్డింగ్లు ధ్వంసమయ్యాయి, ఇది బిజెపి మరియు టిఎంసి మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.

గోవాలో అధికారం కోసం రాలేదు
కోస్తా రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ గురువారం సాయంత్రం గోవా చేరుకున్నారు. శుక్రవారం, నటుడు నఫీసా అలీ గోవాలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో చేరారు, వచ్చే ఏడాది గోవా ఎన్నికలకు ముందు నఫీసా అలీ చేరిక పార్టీకి పెద్ద ప్రోత్సాహాన్ని సాధించింది. తాము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తామని, అందమైన గోవా ను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. తాను గోవాకు అధికారం చేజిక్కించుకోవడానికి రాలేదని చెప్పిన మమతాబెనర్జీ, గోవా ప్రజలకు సహాయం చేయడానికి ఇక్కడకు వచ్చానని తెలిపారు.

గోవా పర్యటనలో మమతా బెనర్జీ .. జాతీయ రాజకీయాలలో కీలక అడుగులు
మీరు చేపలను ప్రేమిస్తారు , మేము చేపలను ప్రేమిస్తాము, మీరు ఫుట్బాల్ను ప్రేమిస్తాము, బెంగాల్ కూడా ఫుట్బాల్ను ప్రేమిస్తుంది అని మమతా బెనర్జీ అన్నారు. మమతా బెనర్జీ వెంట గోవా మాజీ ముఖ్యమంత్రి లూయిజిన్హో ఫలేరో, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, స్థానిక నేతలు ఉన్నారు. బెంగాల్ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తర్వాత, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారేందుకు ప్రయత్నిస్తోంది .
అందులో భాగంగానే గోవా ఎన్నికల బరిలోకి దిగుతుంది. గోవా పర్యటనలో భాగంగా శనివారం, మమతా బెనర్జీ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు, అనంతరం ఓల్డ్ గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ మరియు మపుసాలోని బోడ్గేశ్వర్ ఆలయాన్ని సందర్శించనున్నారు.












Click it and Unblock the Notifications