షాకింగ్: ప్రభుత్వాలే యూనియన్ పెడితే -కేంద్రంపై పోరుకు రాష్ట్రాల యూనియన్ ప్రతిపాదించిన మమత
కార్మికులు, కూలీలు, రైతులు, ఉద్యోగులు లాంటి వివిధ స్థాయిల శ్రామికులు తమ డిమాండ్ల సాధన కోసం యూనియన్లు పెట్టుకుని ఆయా యాజమాన్యాలపై, ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తుండటం నిత్యం మనం చూస్తున్నదే. వాళ్లలో వాళ్లకు ఐక్యమత్యం కోసం కూడా చాలా రకాల యూనియన్లుంటాయి. అదే దేశాలైతే కూటములుగా ఏర్పడి తమ ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రభుత్వాలనేలే పార్టీలు సైతం యూనియన్లకు నేతృత్వం వహిస్తుండటమూ తెలిసిందే. అయితే, ప్రభుత్వాలే యూనియన్ మాదిరి సంఘటితమై ఫెడరల్ సర్కారుపై పోరాడాలనే అనూహ్య ప్రతిపాదనను తొలిసారి తెరపైకి తెచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..

యూనియన్ ఆఫ్ స్టేట్స్
రాజ్యంగం ప్రకారం భారత్ అనేది.. యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే, రాష్ట్రాల సమూహం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాగే మన దగ్గరా రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు, ప్రభుత్వాలుండటం తెలిసిందే. కాగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం, రాష్ట్రాల మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతున్నదని విపక్షాల ఆరోపణ. జీఎస్టీ, కొవిడ్ వ్యాక్సిన్ తదితర సందర్భాల్లో ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిందా అనే స్థాయిలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. కేంద్రంలోని బీజేపీ.. తన ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష కనబరుస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. కాబట్టే కేంద్రంపై పోరాటానికి రాష్ట్రాలు యూనియన్ లా ఏర్పడాలని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పేరుతో ఒక్కటై పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు.

బీజేపీకి వ్యతిరేకంగా..
''సమాఖ్య నిర్మాణంలో, రాష్ట్ర ప్రభుత్వాల యూనియన్ ఉండాలి. ఏదైనా రాష్ట్రం వేధింపులకు గురైతే ఇతర రాష్ట్రాలు దాని కోసం పోరాడతాయి. ప్రతి ముఖ్యమంత్రి (ఎన్డీయేతర పాలిత రాష్ట్రాలన్నీ) కలిసి ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతిపక్ష పార్టీలను (బిజెపికి వ్యతిరేకంగా) ఏకం చేయాలని నేను కోరుతున్నాను''అంటూ మమత సంచలన ప్రకటన చేశారు. కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టడం, ధిక్కరించడం లాంటి చర్యలేగానీ, ఇటీవలి చరిత్రలో ఏకంగా కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రాలే యూనియన్ పెట్టాలన్నత స్థాయిలో ఒక ముఖ్యమంత్రి బాహాటంగా ప్రకటన చేయడం దాదాపు ఇదే తొలిసారి.

ముఖ్యమంత్రులకు మమత లేఖలు
వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు ఇప్పటికే ఆరు నెలలు దాటగా, రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ బుధవారం కోల్ కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చేలా బీజేపీయేతర ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తానని ప్రకటించిన మమత.. ఆ సందర్బంలోనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ప్రతిపాదనను వెలిబుచ్చారు. ఏడు నెలలుగా పోరాడుతున్నా రైతుల్ని కేంద్రం పట్టించుకోకపోవడం మోదీ అహంకార ధోరణికి నిదర్శనమని మమత అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రైతు సంఘాలన్నీ బీజేపీ ఓటమికి కృషి చేయడం తెలిసిందే. కాగా, మమత పిలుపునిచ్చిన యూనిన్ ఆఫ్ స్టేట్స్ పై మిగతా రాష్ట్రాల సీఎంలు స్పందించాల్సిఉంది.












Click it and Unblock the Notifications