డ్రగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది: చిక్కుల్లో నటి మమత కులకర్ణి
థానే: రెండు నెలల క్రితం పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 2 వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత కేసులో బాలీవుడ్ సినీ నటి మమత కులకర్ణి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో మమతపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేయాల్సిందిగా సీబీఐ ద్వారా ఇంటర్ పోల్ను థానే పోలీసులు కోరనున్నారు.
ముంబై శివారులోని థానేలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్కి సంబంధించిన మూలాలు ఆఫ్రికా దేశం కెన్యాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. అక్కడే మమతతో పాటు ఆమె భర్త, అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ విక్కీ గోస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా ఈ కేసులో ఇప్పటికే 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో శనివారం థానేలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ పరంవీర్ సింగ్ డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తు పురోగతిని మీడియాకు వెల్లడించారు. అరెస్ట్ సమయంలో మమత కులకర్ణి చెప్పుకున్నట్లు ఆమె అమాయకురాలు కాదని, మాదకద్రవ్యాల సరఫరా వ్యవహారంలో ఆమె పాత్ర కూడా ఉందని అన్నారు.
జనవరి 8న అంతర్జాతీయ డ్రగ్ మాఫియా అబ్దుల్లాతో కలిసి కెన్యాలో ఆమె సమావేశంలో పాల్గొన్నట్టు దర్యాప్తులో ఆధారాలు లభించాయని, అందుకే నిందితుల జాబితాలో ఆమె పేరుని చేర్చుతున్నట్లు పరంవీర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో కెన్యూ నుంచి భారత్కు డ్రగ్స్ను ఎలా తీసుకెళ్లాలనే దానిపై చర్చించారని పేర్కొన్నారు.
అలాగే మమత, గోస్వామిలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, ఆస్తుల వివరాలు కూడా సేకరిస్తామని పరంవీర్ సింగ్ తెలిపారు. థానేలో పట్టుబడ్డ డ్రగ్స్ను కెన్యా నుంచి సరఫరా చేశారన్న ఆరోపణలపై మమత కులకర్ణి, ఆమె భర్త విక్కీ గో స్వామిని గత నెల కెన్యా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మాదక ద్రవ్యాల సరఫరాలో మమత కులకర్ణి బాలీవుడ్ లోని కొందరు వ్యక్తుల సహాయం తీసుకున్నారని, ఆ సెలబ్రిటీలను ఇప్పటికే విచారించామని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో థానే పోలీసులు 20 టన్నులు ఎఫీఢ్రిన్ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని విలువ సుమారు రూ. 2వేల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.