ఆర్థిక ఇబ్బందులు: భార్య బిడ్డలకు నిప్పుపెట్టి ఆత్మహత్య
బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు తాళలేని ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య, ముగ్గురు సంతానంపై కిరోసిన పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతను కూడా కత్తితో గొంతుకోసుకుని ప్రాణాలు చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరుకు శివారులోని మంచనహళ్లిలో ఉంటున్న ఫయాజ్ పాషా(35), ఆయన భార్య కవిత అలియాస్ రేష్మా(30), పిల్లలు నెహబుబ్(5), ఉష్ణ(2), 11 నెలల పసి బాలుడు సాదల్ ఈ ఘటనలో మృతి చెందారు. మరో ముగ్గురు సంతానం అదృష్ణవశాత్తు ప్రాణాలు దక్కించుకున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తమకూరు జిల్లా సిరా ప్రాంతానికి చెందిన ఫయాజ్ పాషా బతుకుదెరువు కోసం 15ఏళ్ల కిందట బెంగళూరు వచ్చాడు. బోమ్మనహళ్లి సమీపంలోని బేగూరులో పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం మొదలుపెట్టాడు.
అదే ప్రాంతానికి చెందిన కవిత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆరుగురు సంతానం. శనివారం రాత్రి 8.30గంటల ప్రాంతంలో పాషా ఇంట్లోంచి కాలిన వాసన రావడంతో చుట్టుపక్కల వారు.. కిటికీలు తెరిచి చూడగా.. నలుగురు కాలిపోయి కనిపించారు. పాషా రక్తపు మడుగులో ఉన్నట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి మృతదేహాలను అనేకల్ ప్రభుత్వ వైద్యాలయానికి తరలించారు. ఫయాజ్ సంతానంలో మరో ముగ్గురు పక్కింటికి వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు.